భారత్తో సిరీస్ ముందు ఫుల్ ప్రాక్టీస్ చేయాలని ఆస్ట్రేలియా టీం నిర్ణయించుకుంది. దీనికి సరేనన్న బీసీసీఐ ఇదే విషయాన్ని నేషనల్ క్రికెట్ అసోసియేషన్ (ఎన్సీయే)కు చెప్పిందట. దీంతో ఆస్ట్రేలియా టీంకు కావలసిన ప్రాక్టీస్ సెషన్ను నిర్వహించే బాధ్యతను ఎన్సీయే తీసుకుంది. ఇప్పటికే ఆసీస్ జట్టు తన ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్ మొదలు పెట్టేసిందని సమాచారం. ఈ ప్రాక్టీస్ సెషన్ నాలుగు రోజులు ఉండనుంది. బెంగళూరులోని ఆలూర్లో ఈ సెషన్ నిర్వహిస్తున్నట్లు ఎన్సీయే తెలిపింది.
నాగ్పూర్ వేదికగా భారత్తో తొలి టెస్టు ఆడే ముందు తమకు ప్రాక్టీస్ సెషన్స్ అవసరం అవుతాయని ఆస్ట్రేలియా జట్టు ఆరంభం నుంచి అంటున్న సంగతి తెలిసిందే. 'మేం ఆలూర్లో ఉన్న సదుపాయాలను మాత్రమే అందిస్తున్నాం. ఈ క్యాంప్ మొత్తం ఎన్సీయే ఆధ్వర్యంలోనే జరుగుతుంది' అని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ క్యాంప్ను పూర్తిగా ఎన్సీయే సూపర్వైజ్ చేస్తోంది. ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైన అన్ని సదుపాయాలను తాము అందిస్తామని, ఈ విషయంలో తాము ఏమాత్రం వెనకడుగు వేయబోమని ఎన్సీయే స్పష్టం చేసింది.
ఈ ప్రాక్టీస్ సెషన్ షెడ్యూల్, టైమింగ్స్ వివరాలను ఎన్సీయే బయటకు పొక్కనివ్వలేదు. 'ఆస్ట్రేలియా జట్టు మేనేజ్మెంట్ అభ్యర్థనలు, షెడ్యూల్, ఇతర వివరాలు కేవలం ఎన్సీయేకి మాత్రమే తెలుసు. ఆసీస్ టీం మేనేజ్మెంట్ ఈ విషయంలో నేరుగా ఎన్సీయే అధికారులతో టచ్లో ఉంది.' అని కర్ణాటక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
భారత్లో పిచ్లకు అలవాటు పడేందుకు తమకు బెంగళూరులో శిక్షణ తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా జట్టు కోరిందని తెలుస్తోంది. ఈ మేరకే ఎన్సీయే ఈ ఏర్పాట్లు చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగే తొలి టెస్టు విధర్భ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మ్యాచ్కు మూడు రోజుల ముందు సెంటర్ పిచ్పై ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందట.