షారుఖ్ను అడిగినా అది జరగలేదు:
సౌరవ్ గంగూలీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. 'గౌతమ్ గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్కతాకు కెప్టెన్ అయ్యాక షారుఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని (పూర్తి స్వేచ్ఛ) నేను ఐపీఎల్ తొలి సీజన్లోనే షారుఖ్ను అడిగాను. కానీ అది జరగలేదు' అని గంగూలీ తెలిపాడు.
ఆయా ఫ్రాంఛైజీల యాజమాన్యాలు స్వేచ్ఛనిచ్చాయి:
'ఐపీఎల్లో అత్యుత్తమ జట్లుగా ఏవైతే ఉన్నాయో వాటికి ఆయా ఫ్రాంఛైజీల యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు' అని దాదా పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్గా రోహిత్ నాలుగు టైటిల్స్ని అందించగా.. చెన్నై సూపర్ కింగ్స్కి ధోనీ మూడు టైటిల్స్ని అందించాడు.
నలుగురు సారథులు ఉంటే:
2009లో తనని కేకేఆర్ కెప్టెన్గా తొలగించడానికి గల కారణాలను కూడా సౌరవ్ గంగూలీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. 'అప్పుడు నన్ను కెప్టెన్గా తొలగించడానికి కోచ్ జాన్ బుచనన్ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు' అని గంగూలీ చెప్పాడు. ఐపీఎల్ తొలి సీజన్ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, తన వల్ల కాదని దాదా స్పష్టం చేశాడు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమేనన్నాడు.
జాన్ బుచానన్ కుట్రలు:
ఐపీఎల్ ఆరంభ సీజన్లలో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్గా ఉన్న సౌరవ్ గంగూలీని ఆ పదవి నుంచి తొలగించాలని అప్పటి కోచ్ జాన్ బుచానన్ కుట్రలు పన్నాడని భారత మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఇటీవల తెలిపాడు. ఒకానొక దశలో దాదాను సారథ్యం నుంచి తొలగించాలని భావించిన బుచానన్.. ఆ పనిలో విజయవంతం అయ్యాడని పేర్కొన్నాడు. గంగూలీ, బుచానన్ మధ్య విభేదాల కారణంగానే అప్పట్లో నైట్రైడర్స్ అంతగా రాణించలేదని చోప్రా చెప్పుకొచ్చాడు. నిజానికి కోల్కతా ముగ్గురు, నలుగురు కెప్టెన్ల విధానం అనుసరించేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నాడు. చివరికి అది డామినో ప్రభావానికి దారితీసిందన్నాడు.