హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్లకు షాక్. !ఈ ఏడాది ఇండోనేషియా వేదికగా జరిగే ఈ పోటీల్లో భారత్ నుంచి 572 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 36 విభాగాల్లో మన క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 312 మంది పురుషులు, 260 మంది మహిళలు. ఇదిలా ఉండగా మొత్తం 232 మంది సహాయక సిబ్బంది ఆటగాళ్లతో పాటు ఇండోనేషియా వెళ్లనున్నారు.
ఐతే, వీరిలో 49 మందికి అయ్యే ఖర్చులు తాము భరించడానికి సిద్ధంగా లేమని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీరిలో 26 మంది మేనేజర్లు, ముగ్గురు కోచ్లు, 20 మంది ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రోజు వారి ఖర్చుల కోసం అథ్లెట్స్, కోచ్ల్లో ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం 50 అమెరికన్ డాలర్లు ఇవ్వనుంది. అదే డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఒక్కొక్కరికి 25 డాలర్లు ఇస్తోంది. మొత్తం 755 మందికి మాత్రమే తాము ఖర్చులు భరిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మిగతా వారు తమ ఖర్చులను తామే భరించాలని అధికారులు తెలిపారు. టోర్నీకి వెళ్లే భారత బృందానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ మాట్లాడుతూ, 'పతకం గెలిచేందుకు ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ అవకాశం మీ ముందుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాలు సాధించాలి' అంటూ క్రీడాకారులకు సూచించారు. గతంలో క్రీడాకారులందరి ఖర్చు లు భరిస్తామన్న క్రీడా శాఖ ఇలా ఎందుకు నిర్ణయించుకుందో..?
జూలై నెలాఖరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఐవోఏ సెక్రెటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ ఐవోఏ అనుబంధ క్రీడా సంఘాలకు మాత్రమే కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. గుర్తింపు ఉన్నా, లేకున్నా క్రీడాకారుల కిట్లు, జెర్సీలకయ్యే ఖర్చును క్రీడాశాఖ గతంలోనూ నిధులు వెచ్చించింది అని మెహతా పేర్కొన్నారు. కిట్లు, యూనిఫామ్లకయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కేంద్ర క్రీడాశాఖ మాటిచ్చింది. ఆసియా క్రీడల్లో పాల్గొనే ఏ ఒక్క జట్టు కూడా కిట్, అధికారిక జెర్సీల కోసమయ్యే ఖర్చులను సొంతంగా భరించనవసరం లేదు. భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే ప్రతి ఒక్క జట్టుకు అవసరమయ్యే కిట్లు, డ్రెస్స్లను ఇవ్వాలంటూ సాయ్ను ఆదేశిస్తున్నాను అని కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.