కొలంబో: పొరుగు దేశం శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారంటే అక్కడ నెలకొన్న సంక్షోభం తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా నిరసన ప్రదర్శనలకు పరిమితమైన ఆందోళనకారులు ఇప్పుడు హింసాత్మక పరిస్థితులకు కారణమౌతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగుతున్నారు. మాజీ మంత్రుల నివాసాలను మంటలపాటు చేస్తోన్నారు. ముదిరిన ఆర్థిక సంక్షోభ పరిస్థితులే దీనికి కారణం.
ఈ పరిణామాల మధ్య శ్రీలంక క్రికెట్ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో నెలకొన్న హింసాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వాళ్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు సమావేశం కావాలనేది తేల్చలేదు. ఆసియా కప్ 2022 నిర్వహణ, ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం ఇది.
ఈ సమావేశాన్ని దుబాయ్లో నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎప్పుడనేది వెల్లడించలేదు. మహీంద రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆందోళనల స్థాయిని ఈ ఘటన స్పష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆసియా కప్ 2022 నిర్వహణ కష్టసాధ్యం కావచ్చనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఆటగాళ్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, రోజురోజుకూ చెలరేగుతున్న హింసను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పదని చెప్పుకొచ్చారు. ఈ టోర్నమెంట్, ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేయాలా?, తటస్థ వేదికలపై నిర్వహించాలా?.. లేక మరో దేశానికి బదలాయింపు చేయాలా? అనేది ఇంకా తేల్చుకోవాల్సి ఉందని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులు వ్యాఖ్యానించారు.
ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణకు శ్రీలంక ఆతిథ్యాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. ఆగస్టు 27వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభం కావాల్సి ఉంది. సెప్టెంబర్ 11వ తేదీన ఫైనల్తో ముగుస్తుంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇందులో పాల్గొనాల్సి ఉండగా.. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడది సాధ్య పడకపోవచ్చని తెలుస్తోంది.