శాస్త్రి చేతుల మీదుగా విరాట్ కోహ్లీ అవార్డు
ఈ అవార్డుల కార్యక్రమంలో కోహ్లీ రెండు అవార్డులు అందుకున్నాడు. వరుసగా రెండు సీజన్ల (2016-17, 2017-18) పాటు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'గా నిలిచిన కోహ్లిని ‘పాలీ ఉమ్రీగర్' ట్రోఫీలతో బోర్డు సత్కరించింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఈ అవార్డును అందజేయడం విశేషం.
|
ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం
ఈ అవార్డు స్వీకరించిన అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "నా భార్య సమక్షంలో అందుకున్న ఈ అవార్డు నాకు ఎంతో ప్రత్యేకం. గతేడాది కూడా ఈ అవార్డు అందుకున్నాను. అప్పుడు ఈ అనూభూతి కలగలేదు. ఎందుకంటే అప్పుడు ఆమె లేదు" అని అన్నాడు.
రెండు సీజన్లకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా
2016-17, 2017-18ల సీజన్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఈ రెండు సీజన్లకు గాను ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' గా నిలిచాడు. 2016-17లో 13 టెస్టుల్లో 74 సగటుతో 1332 పరుగులు, 24 వన్డేల్లో 84.22 సగటుతో 1516 పరుగులు చేశాడు. 2017-18 సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 6 టెస్టుల్లో 89.6 సగటుతో 896 పరుగులు చేశాడు.
నితీశ్ కుమార్ రెడ్డికి జగ్మోహన్ దాల్మియా అవార్డు
ఇదే కార్యక్రమంలో అన్షుమన్ గైక్వాడ్, సుధా షాలకు ‘సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్' అవార్డులు దక్కాయి. రెండు సీజన్లలో వేర్వేరు విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లందరూ అవార్డులు అందుకున్నారు. అండర్-16 విభాగంలో అత్యుత్తమ ఆటతీరు చూపించిన తెలుగు కుర్రాళ్లు ఠాకూర్ తిలక్ వర్మ (హైదరాబాద్ జట్టు), నితీశ్ కుమార్ రెడ్డి (ఆంధ్ర జట్టు)లకు మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి ‘జగ్మోహన్ దాల్మియా' అవార్డు అందించారు.