చలో చలో డిన్నర్ టైమ్:
కెవిన్ పీటర్సన్, విరాట్ కోహ్లీల మధ్య ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ సీరియస్గా జరుగుతున్న సమయంలో కోహ్లీ భార్య, బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎంట్రీ ఇచ్చి ఫన్నీగా మార్చేసింది. అనుష్క శర్మతో కలిసి తాను ఎప్పుడూ ఇన్నిరోజుల సమయం గడపలేదని కోహ్లీ ఎమోషనల్గా చెప్తుండగా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ 'చలో చలో డిన్నర్ టైమ్' అని నవ్వుతున్న ఎమోజీని జతచేసి లైవ్చాట్లో కామెంట్ పెట్టింది. దాన్ని స్క్రీన్షాట్ తీసిన పీటర్సన్ అభిమానులతో పంచుకున్నాడు. అనుష్కను కోహ్లీ బాస్గా పీటర్సన్ అభివర్ణించాడు.
కోహ్లీకి బాస్ పంచ్:
అనంతరం అనుష్క నిద్రపోయేముందు కోహ్లీతో సరదాగా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్తో తీసుకున్న ఫొటోలను స్టోరీస్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు లైకులు వర్షం కురుస్తుంది. 'కోహ్లీకి బాస్ పంచ్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'డిన్నర్ టైమ్ మరి వెళ్లాలిగా' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. అనుష్క ఎంట్రీ ఇవ్వడంతో లైవ్చాట్ అక్కడితోనే ఆగిపోయింది.
ఐపీఎల్ గెలిచే అర్హత ఆర్సీబీకి ఉంది:
ఇన్స్టాగ్రామ్ లైవ్చాట్ సందర్భంగా పీటర్సన్తో మాట్లాడేటప్పుడు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ఒక్కసారి కూడా విజేతగా నిలవకపోవడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. 'ఆర్సీబీ ప్రతి ఏడాది స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతూ ఉంటుంది. దీని వల్ల అభిమానుల్లో మాపై ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి. ఈసారైనా గెలుస్తారంటూ అభిమానులు అనుకోవడం వల్ల ప్రతి మ్యాచ్లో ఒత్తిడి నెలకొంటుంది. ఇప్పటి వరకు మేము మూడు ఫైనల్స్ ఆడి రన్నరప్తో సరిపెట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఇవన్నీ అనసవరం. నిజాయితీగా చెప్పదల్చుకున్నాను ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ గెలిచే అర్హత ఉంది'అని అన్నాడు.
ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్:
'2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 113 పరుగులు చేయడం నా ఐపీఎల్ కెరీర్లో ఎప్పటికి మరిచిపోలేని ఇన్నింగ్స్. పంజాబ్తో మ్యాచ్లో నేను అనుకున్న రీతిలో బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదించాను. దక్షిణాఫ్రికాలో జరిగిన 2009-10 సీజన్లో నీతో (పీటర్సన్)తో పాటు కలిస్, బౌచర్, అనిల్ భాయ్, రాబిన్తో కలిసి ఆర్సీబీకి ఆడటం నాకు చిరకాలం గుర్తుంటుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ను బీసీసీఐ ఈనెల 15 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.