హైదరాబాద్: మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్. బంగ్లాదేశ్ పర్యటనకు గాను 13 మంది సభ్యుల జట్టులో కూడిన వెస్టిండిస్ జట్టు ఆ దేశ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టులో ఆండ్రీ రస్సెల్ కూడా చోటు దక్కించుకున్నాడు.
ఆండ్రీ రస్సెల్ చివరిసారిగా 2015లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆడాడు. ఆ తర్వాత డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్పై ఏడాది పాటు నిషేధం విధించారు. యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకోవడంతో ఏడాది పాటు వెస్టిండిస్ జట్టుకు దూరమయ్యాడు.
నిషేధం గడువు ముగియడంతో అతడికి జట్టులో చోటు కల్పిస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2015లో మూడు వేర్వేరు తేదీల్లో తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో రసెల్ విఫలమయ్యాడు.
"2019 వరల్డ్ కప్కు ఇది ఆరంభం. మెగా టోర్నీకి ఎంపికకావడానికి ఆటగాళ్లకు ఇది సువర్ణావకాశం. వచ్చే ఏడాది వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో రస్సెల్కు చోటు కల్సిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అతనొక అసాధారణ ఆటగాడు. రస్సెల్ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రపంచానికి తెలుసు" అని రస్సెల్ పునరాగమనంపై విండీస్ ప్రధాన కోచ్ స్టువర్ట్ లా ఆనందం వ్యక్తం చేశాడు.
"రస్సెల్ వంటి ఆల్ రౌండర్ జట్టులోకి రావడంతో మా బలం రెట్టింపు అయ్యింది. ఈ మధ్య కాలంలో జరిగిన మ్యాచ్ల్లో ఆటగాళ్లు సత్తాచాటి ఇంగ్లాండ్లో జరిగే టోర్నీకి వెళ్లే టీమ్లో ఉండాలని ఆశిస్తున్నా. రస్సెల్ జట్టులోకి రావడం గొప్పగా అనిపిస్తోంది. అతనిలో ఉన్న ఎక్స్ప్లోజివ్ పవర్, ఎనర్జీ.. ఇప్పటికే మంచి ఉత్సాహాంగా ఉన్న జట్టులో నూతనోత్తేజాన్ని నింపుతుంది" అని అన్నాడు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన రస్సెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్లో మొత్తం 316 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.