ప్రస్తుతానికి సవాలే:
ఈ నెల 19న జరిగే తమ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ ఎదుర్కొబోతున్నది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కూర్పుపై కివీస్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఓ టెలివిజన్ షోలో మాట్లాడుతూ... 'సురేష్ రైనా లాంటి క్లాస్ క్రికెటర్ను, నిలకడగా రాణించే ఆటగాడిని, మైదానంలో పరుగుల వరద పారించడంతో పాటు ఫీల్డింగ్లో ఆకట్టుకునే ప్లేయర్ను వెతకడం చాలా కష్టం. చెన్నై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవ లేనప్పటికీ మూడో స్థానంలో కుదురుకునే ప్లేయర్ను ఎంచుకోవడం ప్రస్తుతానికి సవాలే. రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది' అని అన్నాడు.
రాయుడు సరైన ఎంపిక:
'కీలకమైన మూడో స్థానంలో అంబటి రాయుడు సరైన ఎంపిక. సురేష్ రైనా స్థానాన్ని అతను భర్తీ చేయగలడు. ఇక టాపార్డర్లో ఇద్దరు విదేశీయులతో పాటు యువ రుతురాజ్ గైక్వాడ్ను ఆడిస్తే బావుంటుంది. భారీ హిట్టింగ్ చేసే ఆటగాడిని తీసుకున్నా మంచిదే' అని స్కాట్ స్టయిరిస్ వివరించాడు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచి రైనా తప్పుకోగా.. అతని స్థానంలో ఎవరిని ఆడించాలి? అనే విషయంలో సీఎస్కే మేనేజ్మెంట్ ఓ క్లారిటీకి రాలేకపోతోంది. జట్టుని రైనా వీడి రెండు వారాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ అతని స్థానంలో ఎవరినీ టీమ్లోకి తీసుకోలేదు. జట్టులోని మరో క్రికెటర్కి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం తారాస్థాయికి చేరింది.
రైనా స్థానంలో మలాన్?:
సురేశ్ రైనా స్థానంలో చెన్నై జట్టులోకి ఇంగ్లండ్కి చెందిన సంచలన ఓపెనర్ డేవిడ్ మలాన్ని తీసుకోబోతున్నట్లు శుక్రవారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇటీవల పాకిస్థాన్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో పరుగుల వరద పారించిన మలాన్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లోనూ నెం.1 స్థానంలో కొనసాగుతున్నాడు. రైనా తరహాలోనే మలాన్ కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ కావడంతో.. అతను చెన్నై జట్టులోకి రావడం ఖాయమని అంతా ఊహించారు. కానీ చెన్నైసీఎస్కే సీఈఓ ఆ వార్తల్ని కొట్టిపారేశారు.