అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత అజయ్ జడేజా అన్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్.. ఇప్పటికైనా గాడిలో పడితేనే ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయన్నాడు. జట్టులో టాలెంట్కు కొదవలేదని, ఆటగాళ్లు ఫామ్ అందుకోవడమే ముఖ్యమని జడేజా పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్లాడిన రాహుల్ సేన మూడే విజయాలు అందుకుంది. గెలిచే కొన్ని మ్యాచులను సొంత తప్పిదాలతో పంజాబ్ చేజార్చుకుంది.
IPL 2021: వారికి కరోనా లేదు.. అవి తప్పుడు రిపోర్టులు: బీసీసీఐ
తాజాగా అజయ్ జడేజా మాట్లాడుతూ... 'పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పాయింట్ల పట్టికలో వారు వెనుకబడి ఉన్నారు. టాప్-4కు రెండు స్థానాల దిగువన ఉంది. పాయింట్ల టేబుల్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కింది స్థానాల్లో ఉన్న జట్లు కూడా పైకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. పంజాబ్ ఒక్కసారి గాడిలో పడితే టాప్లోకి వస్తుంది. పంజాబ్ ఇంకా టాప్-5లో ఉన్న నాలుగు జట్లతో ఆడాల్సి ఉంది. వారిని కొడితే ప్లేఆఫ్ రేసులోకి వస్తారు. మిగిలిన ఉన్న మ్యాచ్ల్లో విజయంపైనే దృష్టి పెట్టండి. వారిని ఓడిస్తామా.. లేదా అనే అపనమ్మకం వద్దు' అని అన్నాడు.
'వరుసగా మ్యాచ్లు గెలవడం అంటే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ అదేమీ అసాధ్యమేమీ కాదు. కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. పంజాబ్కు రాహుల్ దూరం కావడం పెద్ద లోటే. ఢిల్లీపై మయాంక్ అగర్వాల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కెప్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వృథానే అయ్యింది' అని అజయ్ జడేజా తెలిపాడు. యూఏఈ వేదికగా జరిగిన గత ఏడాది సెకాండాఫ్లో పుంజుకున్న పంజాబ్.. వరుసగా విజయాలు సాధించింది. కానీ ప్లేఆఫ్స్ రేసుకు అడుగు దూరంలో నిలిచిపోయింది. ఈసారి విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ వెళ్లాలని జడేజా సూచించాడు.
ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (58 బంతుల్లో 99 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగు తేడాతో సెంచరీ కోల్పోగా.. ఢిల్లీ బౌలర్లలో కాగిసో రబడ మూడు వికెట్లు పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (69 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (39) రాణించారు. మయాంక్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.