హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డుపై పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ కన్నేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ఐదు వన్డేల సిరిస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన నాలుగోవన్డేలో ఈ పాకిస్తాన్ ఓపెనర్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ(210 నాటౌట్) సాధించాడు.
దీంతో పాక్ తరుపున తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా విరాట్ కోహ్లీ రికార్డుపై ఫకార్ జమాన్ కన్నేశాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే వన్డేల్లో అత్యంత వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించడం. ఇప్పటి వరకు 17 వన్డే మ్యాచ్లాడిన ఫకార్ 17 ఇన్నింగ్స్ల్లో కలిపి 980 పరుగులు సాధించాడు.
మరో 20 పరుగులు చేస్తే అతడు అంతర్జాతీయ క్రికెట్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల క్లబ్లో చేరతాడు. కాగా, కోహ్లీ 24 ఇన్నింగ్స్ల ద్వారా 2008లో వెయ్యి పరుగుల క్లబ్లో చేరగా.. వెస్టిండీస్ ఆటగాడు వివ్ రిచర్డ్స్ 21 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పుడు ఈ రికార్డుపై ఫకార్ జమాన్ కన్నేశాడు.
ఐదు వన్డేల భాగంగా ఆతిథ్య జింబాబ్వేతో పాకిస్థాన్ ఆదివారం చివరి వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్లో 20 పరుగులు చేస్తే ఫకార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కేవలం 18 ఇన్నింగ్స్ల ద్వారానే ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా తన పేరిట రికార్డు నెలకొల్పుతాడు.