
హైదరాబాద్: క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి వింత బహుశా భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరగదేమో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జింబాబ్వే-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక వన్డే సిరిస్ జరుగుతోంది.
ఈ వన్డే సిరిస్లో భాగంగా మూడు రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్థాన్ జట్టు నిర్ణతీ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన జింబాబ్వేను 179 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆప్ఘన్ జట్టు 154 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజాగా, ఇప్పుడు రెండో వన్డేలో కూడా సరిగ్గా అదే విధంగా స్కోర్లు నమోదయ్యాయి. కాకపోతే ఇక్కడ చిన్నపాటి మార్పు చోటు చేసుకుంది. రెండో వన్డేలో జింబాబ్వే తొలి వన్డేలో అప్ఘనిస్థాన్ ఎన్ని పరుగులు అయితే చేసిందో సరిగ్గా అన్నే పరుగులు చేసింది.
జింబాబ్వే వికెట్ కీపర్ బ్యాట్స్మన్ బ్రెండన్ టేలర్ (125), ఆల్ రౌండర్ సికిందర్ రజా (92) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆప్ఘనిస్థాన్ జట్టుని తొలి వన్డేలో ఎన్ని పరుగులకు అయితే ఆలౌట్ అయిందో అన్నే పరుగులకు ఆలౌట్ చేసి ఆశ్చర్యపరిచింది.
రెండో వన్డేలో భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ జట్టు జింబాబ్వే బౌలర్లు క్రీమర్ (4/41), చటార (3/24)ల ధాటికి 30.1 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో జాద్రాన్ (47), రహ్మద్ షా (43), మహ్మద్ నబి (31) మాత్రమే ఫరవాలేదనిపించారు.
తాజా విజయంతో జింబాబ్వే ఐదు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ రెండు జట్లు కూడా జింబాబ్వే వేదికగా వచ్చే నెలలో 2019 వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీని ఆడనున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.