లక్నో: స్టార్ ఆటగాడు రోస్టన్ చేజ్ (94; 11 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో అఫ్ఘానిస్థాన్పై వెస్టిండీస్ సునాయాస విజయం అందుకుంది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో విండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘాన్ 45.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. విండీస్ బౌలర్ల దెబ్బకు ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (9), జావేద్ అహ్మది (5) త్వరగానే పెవిలియన్ చేరారు.
'గాడియం' వ్యాపారం కోసం కాదు.. యువ క్రికెట్ ప్రతిభను మెరుగుపరిచేందుకే: అశ్విన్
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రహ్మత్ షా (61), ఇక్రమ్ అలికిల్ (58) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఆచితూచి ఆడుతూ షా, ఇక్రమ్ అర్ధ సెంచరీలు చేశారు. ఈ క్రమంలో 100కుపైగా భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోర్ 126 వద్ద అఫ్ఘాన్ రెండు వికెట్లు కోల్పోయింది. షా, నజీబుల్లా జద్రాన్ (0) క్యాచ్ ఔట్ అయ్యారు. కీలక వికెట్లు కోల్పోవడంతో అఫ్ఘాన్ కష్టాల్లో పడింది.
కొద్ది సమయానికే ఇక్రమ్ కూడా రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ (1) విఫలమయినా.. అస్గర్ ఆఫ్ఘన్ (35), గుల్బాదీన్ నైబ్ (17) విలువైన పరుగులు చేశారు. కెప్టెన్ రషీద్ ఖాన్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో అఫ్ఘాన్ తక్కువ పరుగులకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, చేజ్, రొమారియో షెపర్డ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
It's a win for West Indies!
— ICC (@ICC) 6 November 2019
An ODI career-best 94 from Roston Chase guides them to victory over Afghanistan by seven wickets 👏 👏 pic.twitter.com/aJxa0hWJMW
అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 46.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 రన్స్ చేసి విజయం సాధించింది. ఆఫ్ఘాన్ స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో కరీబియన్లు ఆడుతూ పాడుతూ విజయం సాధించారు. రోస్టన్ చేజ్ (94), షాయ్ హోప్ (77 నాటౌట్) మూడో వికెట్కు 163 పరుగులు జత చేసి జట్టును గెలిపించారు. స్పిన్నర్ ముజిబుర్ రహ్మాన్ (2/33) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. భారత్ను సొంతగడ్డగా చేసుకుని అఫ్ఘాన్ అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగనుంది.