
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పేసర్ కేన్ రిచర్డ్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి తప్పుకున్నాడు. తన భార్య త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో కేన్ ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్నాడు. ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ స్థానంలో ఆ దేశానికే చెందిన స్టార్ లెగ్స్పిన్నర్ ఆడమ్ జంపాను జట్టులోకి తీసుకున్నట్లు ఆర్సీబీ ప్రాంచైజీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
'ఆర్సీబీలోకి ఆడమ్ జంపాను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. కేన్ రిచర్డ్సన్ స్థానాన్ని అతను భర్తీ చేస్తున్నాడు. లెట్స్ ప్లేబోల్డ్ ఆడమ్ జంపా' అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఆర్సీబీ తమ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడానికి ఐపీఎల్ 2020 వేలంలో కేన్ రిచర్డ్సన్ను రూ .4 కోట్లకు తీసుకుంది. అంతర్జాతీయ కెరీర్లో జంపా ఇప్పటివరకు 55 వన్డేల్లో, 30 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 11 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు. జంపా ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ తరఫున ఆడాడు.
ఐపీఎల్ 13వ ఎడిషన్కు రిచర్డ్సన్ అందుబాటులో లేకపోవడంపై ఆర్సీబీ డైరెక్టర్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'కేన్ రిచర్డ్సన్ ఈ ఏడాది సీజన్కు అందుబాటులో లేకపోవడం మాకు నిరాశ కలిగించే అంశం. అతను మంచి పేసర్. రిచర్డ్సన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. బిడ్డ పుట్టేసమయంలో అతడు అక్కడ ఉండాలి కాబట్టి మద్దతు ఇచ్చాం. ఆడమ్ జంపా చేరిక మా స్పిన్ విభాగంను మరింత పటిష్టం చేసింది. యూఏఈలో స్పిన్నర్లకు సహాయపడే ట్రాక్లలో లెగ్ స్పిన్నర్ను ఉపయోగించవచ్చు. అతడు నాణ్యమైన లెగ్ స్పిన్నర్' అని హెస్సన్ తెలిపారు.
యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, మొయిన్ అలీ, పవన్ నేగీ వంటి స్పిన్నర్లు ఇప్పటికే బెంగళూరు జట్టులో ఉండగా.. ఆడమ్ జంపా రాకతో ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ దళానికి మరింత బలం చేకూరనుంది. ఇప్పటికే ఆటగాళ్ల వేలం 2020లో ఓపెనర్ అరోన్ ఫించ్, ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, ఆల్రౌండర్ క్రిస్ మోరీస్లను తీసుకుని జట్టుని బలోపేతం చేసుకుంది. గత కొన్ని సీజన్లుగా బౌలింగ్ విభాగంలో తెగిలిపోతున్న ఆర్సీబీని స్టెయిన్, మోరీస్లు కచ్చితంగా ఆదుకునే అవకాశం ఉంది.