హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన కొద్ది రోజులకే ఎవ్వరూ ఊహించని విధంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు. తన నిర్ణయానికి ఎంతోమంది షాక్కు గురైనా దానికి వెనుకున్న మర్మమేమిటో చెప్పలేదు. కానీ, ఇప్పుడు తాజాగా అతను పాల్గొన్న ఇంటర్వ్యూలో నిజాలు చెప్పుకొచ్చాడు. 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడిన డివిలియర్స్.. కనీసం వచ్చే ఏడాది వరల్డ్కప్ వరకైనా ఆడతారని చాలా మంది భావించారు.
బాగా రాణించాలన్న ఒత్తిడిని తాను భరించలేకపోయానని ఈ సందర్భంగా అతడు చెప్పాడు. అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయని, అంతటి అటెన్షన్ను తాను తట్టుకోలేకపోయానని డివిలియర్స్ తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్టేలియాతో తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఆడిన ఏబీ.. సిరీస్ ముగియగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ చివరి రోజుల్లో వరుస గాయాలతోపాటు ఫామ్ కోల్పోయి అతను సతమతమైయ్యాడు. క్రికెట్ను తాను చాల్ మిస్ అవుతున్నా.. తన నిర్ణయంపై మాత్రం ఎప్పుడూ చింతించలేదని ఏబీ స్పష్టంచేశాడు.
క్రికెట్ నుంచి తప్పుకొని కుటుంబంతో గడపటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. 2004లో సౌతాఫ్రికా టీమ్ తరఫున ఏబీ డిలియర్స్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి టెస్టుల్లో 8765 పరుగులు, వన్డేల్లో 9577 పరుగులు, టీ20ల్లో 1672 పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో 50కిపైగా సగటు సాధించాడు. అయితే పూర్తి శాతం క్రికెట్కు విరామం ప్రకటించిన డివిలియర్స్ మళ్లీ కొద్ది వారాలకే నిర్ణయం మార్చాడు.
తనకు ఐపీఎల్ లీగ్లో పాల్గొనే జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే చాలా ఇష్టమని.. చెప్పాడు. తాను బెంగళూరు జట్టు తరపున దిగనని చెప్పలేదన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. డివిలియర్స్ మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిన విషయమే.