తొలి బ్యాట్స్మన్గా ఏబీ
ఏబీ డివిలియర్స్ 3288 బంతుల్లో 5వేల పరుగుల మార్క్ను అందుకున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 3554 బంతుల్లో 5000 పరుగులు పూర్తిచేశాడు. ఏబీ, వార్నర్ మధ్య 266 బంతుల అంతరం ఉంది. ఈ జాబితాలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (3620), ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ (3817), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (3827), ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (3956)లు వరుసగా ఉన్నారు. ఇప్పట్లో డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టే ఆటగాడు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
రెండో ఓవర్సీస్ ప్లేయర్గా
ఈ క్యాష్ రిచ్ లీగ్లో 5వేల పరుగుల మార్క్ను సాధించిన రెండో ఓవర్సీస్ ప్లేయర్గా 'మిస్టర్ 360' ఏబీ గుర్తింపు పొందాడు. డివిలియర్స్ కన్నా ముందు ఓవర్సీస్ ప్లేయర్గా డేవిడ్ వార్నర్ 5000 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఓవరాల్గా అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ 6041తో టాప్లో ఉన్నాడు. సురేశ్ రైనా (5472), శిఖర్ ధావన్ (5456), రోహిత్ శర్మ (5431) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్, డివిలియర్స్ ఐదు, ఆరో స్థానంలో ఉండగా.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (4891), చెన్నై సారథి ఎంఎస్ ధోనీ (4669), చెన్నై ఆటగాడు రాబిన్ ఊతప్ప (4607), కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (4217) టాప్-10లో కొనసాగుతున్నారు.
2011 నుంచి బెంగళూరుకే
ఏబీ డివిలియర్స్ 2011 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. అంతకుముందు ఏబీడీ ఢిల్లీ డేర్ డేవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్)కు ఆడాడు. ఢిల్లీ తరఫున 28 మ్యాచ్ల్లో 671 రన్స్ చేసిన ఏబీడీ.. ఆర్సీబీ తరఫున 4,382 రన్స్ చేశాడు. ఓవరాల్గా ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 175 మ్యాచులు ఆడిన ఏబీడి 5053 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 133 నాటౌట్. మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు బాదాడు. మెగా టోర్నీలో 406 ఫోర్లు, 245 సిక్సులు బాదాడు.
1 పరుగు తేడాతో
ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీపై బెంగళూరు 1 పరుగు తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ హాఫ్సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులకు పరిమితమైంది. హెట్మైర్ (25 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషబ్ పంత్ (58 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. డివిలియర్స్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.