సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ ప్రశంశల జల్లు కురిపించాడు. వన్డే క్రికెట్లో విరాట్ కోహ్లీనే ఆల్టైం బెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. కెరీర్ ఆరంభం నుండి కోహ్లీ గొప్ప ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని, అదే అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ఫించ్ చెప్పుకొచ్చాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన భారత కెప్టెన్ మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో కోహ్లీ స్థిరత్వం అతని సమకాలీనులకు అసూయ కలిగించేదిలా ఉంది.
'సోనీ టెన్ పిట్ స్టాప్' షో తాజా ఎడిషన్లో ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ... 'ప్రతి ఒక్క ఆటగాడు కొన్ని సిరీస్లలో చెత్త ప్రదర్శనలు చేస్తారు. దానికి ఏ ఎవరూ అతీతం కాదు. అయితే ఒకటి కంటే ఎక్కువసిరీస్లలో రాణించకపోతేనే అతడి ఆటతీరుపై అపనమ్మకం ఏర్పడుతుంది. కానీ.. విరాట్ కోహ్లీ అలా కాదు. ఎప్పుడూ వరుస సిరీస్లలో కోహ్లీ రాణించని దాఖలాలు లేవు. ఓ సిరీస్లో రాణించకపోయినా.. రెండో సిరీస్లో గొప్పగా ఆడి విమర్శకుల నోరు మూయిస్తాడు' అని అన్నాడు.
'విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో పరుగుల వరద పారిస్తున్నాడు. అతని స్థిరత్వమే ఇంతకాలం ఆకట్టుకుందని నేను భావిస్తున్నా. వన్డే క్రికెట్లో విరాట్ అత్యుత్తమ ఆటగాడు అని నేను అనుకుంటున్నా. కోహ్లీనే నా ఆల్టైం బెస్ట్ వన్డే ఆటగాడు. వన్డేల్లో మాత్రమే కాదు టెస్ట్, టీ20లలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు' అని ఫించ్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్, డేవిడ్ వార్నర్, బాబర్ ఆజామ్, రోహిత్ శర్మ ప్రస్తుతం టాప్ బ్యాట్స్మన్లుగా కొనసాగుతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓ సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోహ్లీని ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
2008లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.
సాధన మొదలెట్టిన సఫారీలు.. మైదానంలోకి 44 మంది!!