
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వల్లే భారత్ తనకు రెండో ఇల్లు అయిందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ అనేక జట్ల తరుపున ఆడాడు. ఐపీఎల్ 2018 సీజన్ కోసం బెంగళూరులో నిర్వహించిన వేలంలో ఆరోన్ ఫించ్ను రూ.6.2కోట్లు చెల్లించి పంజాబ్ ఫించ్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా, ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ 'భారత్ నాకు రెండో ఇల్లు లాంటిది. ఇక్కడికి చాలా సార్లు వచ్చాను. వివిధ ఫ్రాంఛైజీలకు ఆడాను. చాలా సిటీలు తిరిగాను. ఈ దేశంలో నేను చాలా సౌకర్యవంతంగా ఫీలవుతాను. దేశ వ్యాప్తంగా నాకు చాలా మంది స్నేహితులున్నారు' అని తెలిపాడు.
ఇక, ఐపీఎల్ను ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియాలో నిర్వహిస్తోన్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) లీగ్కు ఐపీఎల్కు చాలా తేడా ఉందని తెలిపాడు. బిగ్ బాష్ లీగ్తో పోల్చుకుంటే ఐపీఎల్లో మ్యాచ్లు ఎక్కువని, వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు ఎక్కువ మంది ఐపీఎల్లో ఆడతారని అన్నాడు.
అదే, బిగ్ బాష్ లీగ్ విషయానికి వస్తే ఎక్కువ స్వదేశీ ఆటగాళ్లే ఉంటారని, అంతేకాకుండా అంతర్జాతీయ షెడ్యూల్స్ కారణంగా ఒక్కోసారి కీలక ఆటగాళ్లు దూరమవుతారని పేర్కొన్నాడు. అయితే ఐపీఎల్ అలా కాదు. ఈ లీగ్కి ఉన్న ఆదరణ, స్థాయి వేరని, టీ20 ఆటగాడు ఈ లీగ్ ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని ఫించ్ తెలిపాడు.