హైదరాబాద్: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ చాంపియన్షిప్లో మంగళవారం జరిగిన పోటీల్లో 35 ఏళ్ల మేరీ కోమ్ సంచలన ప్రదర్శన చేసి సెమీ ఫైనల్లో ప్రవేశించింది. తద్వారా మేరీ కోమ్ కెరీర్లో ఏడో పతకాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్గా అరుదైన రికార్డు సృష్టించింది.
మంగళవారం జరిగిన 48 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో 35ఏళ్ల మేరీ కోమ్ చైనాకు చెందిన వూ యూపై 5-0తో విజయం సాధించింది. ప్రపంచ చాంపియన్షిప్లో సెమీస్కు చేరిన ప్రతి బాక్సర్ కాంస్య పతకాన్ని అందుకుంటాడు. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ సెమీస్కు చేరి కనీసం కాంస్యాన్ని దక్కించుకోనుంది.
ఇదిలా ఉంటే, ఈ చాంపియన్షిప్లో మేరీకోమ్ అరుదైన రికార్డుని అందుకుంది. గతంలో టోర్నీలో పాల్గొన్న ఆమె 5స్వర్ణాలు, ఒక సిల్వర్ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. చివరిసారిగా 2010లో 48 కేజీలో కేటగిరీలో పతకం సాధించింది. తాజా విజయంతో వయసు మీద పడుతున్నప్పటికీ తనలో ఏమాత్రం జోరు తగ్గలేదని మరోసారి మేరీకోమ్ నిరూపించింది.