విశాఖపట్నం: 'విశాఖ ఉత్సవ్' ఉత్సవాల్లో ఈరోజు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏపీలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, చింతకాల అయ్యన్నపాత్రుడు ఒకే పార్టీకి చెందిన వారైనప్పటికీ గత కొంతకాలంగా వీరిద్దరికీ ఒకరంటే ఒకరు పడని విషయం తెలిసిందే.
విశాఖపట్నం టీడీపీలో ఆధిపత్యం కోసం ఎప్పుడూ పొట్లాడుకునే వీరిద్దరూ శుక్రవారం ఆర్కే బీచ్లో కాసేపు సందడి చేశారు. జనవరి 1 నుంచి 3 వరకు విశాఖలో 'విశాఖ ఉత్సవ్' పేరిట ఉత్సవాల్లో వీరిద్దరూ సరదాగా బాక్సింగ్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా మంత్రుల బాక్సింగ్ ఫైట్ను ఆసక్తిగా తిలకించారు.
అంతకుముందు ప్రతిష్టాత్మక విశాఖ ఉత్సవ్ను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఉడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫల, పష్ప ప్రదర్శనతో పాటు ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన తొమ్మిది దేవాలయాల నమూనాలను మంత్రి పరిశీలించారు. జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలను వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.
మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో తొలిరోజైన శుక్రవారం ఆర్థిక మంత్రి యనమలరామకృష్ణుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జనవరి 2 (శనివారం) జరగనున్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా రానున్నారు. రేపు బీచ్రోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్ధులతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలతో కార్నివాల్ ఏర్పాటు చేశారు.
ప్రముఖ సింగర్స్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో స్వరాభిషేకం, నాగూర్బాబు, ఉషా వూతప్ ఆధ్వర్యంలో మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీచ్రోడ్డులోని హోటళ్ల ఆధ్వర్యంలో ఫుడ్ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్ధాలు సరసమైన ధరలకు ఇక్కడ లభిస్తున్నాయి.