
హైదరాబాద్: ఉలన్ ఉదే వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 3వ సీడ్ మేరీ కోమ్ రియో ఒలింపిక్స్ పతక విజేత ఇంగ్రిత్ వెలెన్సియాపై 5-0 తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో తలపడుతోంది. తాజా విజయంతో ఓ అరుదైన రికార్డు మేరీ కోమ్ ఖాతాలో చేరింది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చరిత్రలో వరుసగా 8 పతకాలను సాధించిన తొలి బాక్సర్గా మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది.
గతేడాది న్యూఢిల్లీలో 48 కిలోల విభాగంలో స్వర్ణం సాధించడంతో క్యూబా పురుషుల లెజెండ్ ఫెలిక్స్ సావోన్(7 పతకాలు) రికార్డుని మేరీ కోమ్ సమం చేసింది. అంతేకాదు 51 కేజీల విభాగంలో మేరీ కోమ్కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఈ టోర్నీలో మేరీ కోమ్ పతకం సాధిస్తే టోక్యో ఒలింపిక్స్ బెర్తు కూడా ఖాయమవుతుంది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇప్పటివరకు మేరీ కోమ్ 6 స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. శనివారం జరగనున్న సెమీస్లో మేరీ కోమ్ రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లు(టర్కీతో) తలపడనుంది. ఈ ఏడాది మేరీ కోమ్ గౌహతి వేదికగా జరిగిన ఇండియా ఓపెన్, ఇండోనేషియాలో జరిగిన ప్రెసిడెంట్ కప్లో స్వర్ణ పతకాలను సాధించింది.
మరోవైపు క్వార్టర్లో తలపడిన ఐదుగురు బాక్సర్లలో నలుగురు సెమీస్ చేరడంతో భారత్కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మంజు రాణి (48 కేజీలు), జమున బొరొ (54 కేజీలు), లవ్లినా బొర్గొహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇదే వేదికలో రెండు సార్లు కాంస్యాలు గెలిచిన కవిత చహల్ (ప్లస్ 81 కేజీలు)కు మాత్రం నిరాశ ఎదురైంది. ఆమె క్వార్టర్స్లోనే ఓడిపోయింది.
48 కేజీల బౌట్లో గత వరల్డ్ ఛాంపియన్ షిప్ కాంస్య విజేత కిమ్ హ్యాంగ్ మి (దక్షిణ కొరియా)కు మంజురాణి షాకిచ్చింది. 54 కేజీల బౌట్లో అస్సామ్ బాక్సర్ జమున బొరొ కూడా 4-1తో ఉర్సులా గాట్లబ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 69 కేజీల్లో లవ్లినా 4-1తో ఆరో సీడ్ కరొలినా కొస్జెస్కా (పోలండ్)పై గెలిచింది.