
హైదరాబాద్: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తనపై చేస్తోన్న విమర్శలపై స్టార్ బాక్సర్ మేరీ కోమ్ స్పందించారు. మేరీకోమ్తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్కు ఎంపిక చేయాలని నిఖత్ జరీన్ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
సెలెక్షన్స్ నిర్వహించకుండా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి మేరీ కోమ్ని పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) తీరుపై కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజుకు లేఖ రాసింది. నిఖత్ జరీన్ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి రిజుజు తన ట్విట్టర్లో దేశ ప్రయోజనాలు, క్రీడలు, అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
అంతేకాదు క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. సెలక్షన్ కమిటీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అయితే, ఈ వివాదాన్ని కేంద్ర మంత్రి వరకు తీసుకు వెళ్లడంపై మేరీకోమ్ శనివారం స్పందించారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నడుచుకోవడమే తనకు తెలుసునని మేరీకోమ్ అన్నారు.
నిఖత్ జరీన్ అంటే తనకేమీ భయం లేదని.. ఆమెతో బాక్సింగ్ చేయడానికి తానేమీ వెనుకాడట్లేదని మేరీ కోమ్ స్పష్టం చేశారు. శనివారం ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మేరీ కోమ్ మాట్లాడుతూ "ఆమె (నిఖత్) నా పేరును మళ్లీ మళ్లీ ఎందుకు తీసుకువస్తోందో నాకు తెలియదు. ఆమె ఆసక్తి ఏమిటో నాకు తెలియదు. ఆమెకు పాపులారిటీ కావాలా. నేను దానిపై మాట్లాడేందుకు ఇష్టపడను" అని అన్నారు.
"2020 ఒలింపిక్స్కు ఎవరు పంపించాలనుకుంటున్నారో బీఎఫ్ఐ నిర్ణయం తీసుకుంటుంది. పతకంతో ఎవరు తిరిగి వస్తారో చూద్దాం. నేను ట్రయల్స్ను దాటవేయాలని లేదా ఒలింపిక్స్కు ఎంపిక కావాలని బీఎఫ్ఐకి ఎప్పుడూ చెప్పలేదు. ఆ విధంగా నేను బిఎఫ్ఐ అభ్యర్థించలేదు" అని మేరీ కోమ్ స్పష్టం చేసింది.
"బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ దీనిని నిర్ణయించే సరైన వ్యక్తి. ఇది సరైనదా లేదా తప్పా అని చెప్పే హక్కు నాకు లేదు. నేను ట్రయిల్స్లో పాల్గొనాలని బీఎఫ్ఐ కోరుకుంటే, నేను దాంతో ఏకీ భవిస్తాను. ఆమెతో పోరాడటానికి నేను ఎందుకు భయపడతాను?" అని మేరీ కోమ్ సూటిగా ప్రశ్నించింది.
అదే సమయంలో ఒలింపిక్స్ ట్రయల్స్ పెట్టకపోవడాన్ని ప్రశ్నించిన నిఖత్ జరీన్కు మద్దతుగా నిలిచిన ఒలింపిక్స్ షూటర్ అభినవ్ బింద్రాపై మేరీకోమ్ మండిపడ్డారు. "నీ పని నువ్వు చూసుకో. అనవసరంగా బాక్సింగ్లోకి రాకు. అతనికి బాక్సింగ్ గురించి ఏమీ తెలియదు. నేను షూటింగ్ గురించి మాట్లాడను. నీకు బాక్సింగ్ పాయింట్ల విధానం తెలుసా?" అంటూ ప్రశ్నించింది.
అసలేం జరిగింది?
2020లో జరిగే ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగుతాయి. ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయాలి. కానీ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) మాత్రం ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన విజేతలను నేరుగా ఎంపిక చేసింది.
ఇటీవల రష్యాలోని ఉలాన్ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్ కాంస్య పతకం సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. ఇదే ఇప్పుడు నిఖత్ జరీన్కు శాపంగా మారింది. మొదటి నుంచీ 51 కేజీల బరిలో రాణిస్తోన్న నిఖత్ జరీన్కు మేరీ అడ్డుగా మారింది.
మేరీ కోమ్ స్టార్ బాక్సర్ కావడంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) ఆమెకే మద్దతుగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత్ తరఫున మేరీకోమ్ను పంపాలనుకుంటున్నట్లు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్ చెప్పకనే చెప్పాడు. దీంతో తాను పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలక్షన్ ట్రయల్సే లేకుండా మేరీకోమ్ను నేరుగా పంపడాన్ని నిఖత్ జరీన్ ప్రశ్నించింది.