చికాగో: గత జూలై నెలలో ఇద్దరు బాక్సర్లు బాక్సింగ్ బౌట్లో ప్రత్యర్థి పిడుగుద్దులతో తీవ్రంగా గాయపడి మరణించిన ఘటన మరువకముందే మరొక బాక్సర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థి పిడుగుద్దులు తాళలేక అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ పాట్రిక్ డే (27) మృతి చెందాడు. బాక్సింగ్ బౌట్లో తలకు తీవ్ర గాయాలు కావడంతో నాలుగు రోజుల పాటు కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడిన పాట్రిక్.. చివరకు బుధవారం ప్రాణాలు విడిచాడు.
టీ10 క్రికెట్ ఒలింపిక్స్కు దోహదం చేస్తుంది: రస్సెల్
శనివారం చికాగలో జూనియర్ మిడిల్వెయిట్ చాంపియన్షిప్లో భాగంగా బాక్సర్ చార్లస్ కాన్వెల్తో జరిగిన మ్యాచ్లో పాట్రిక్ డే నాకౌట్ అయ్యాడు. పాట్రిక్పై చార్లస్ బలమైన పంచ్లను సంధించాడు. దీంతో రింగ్లో నిలబడలేకపోయిన పాట్రిక్ అక్కడే కుప్పకూలాడు. వెంటనే స్ట్రెచర్ సాయంతో ఆస్పతికి తరలించి చికిత్స అందించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాట్రిక్కు చేసిన చికిత్స సఫలం కాలేదు.
అయితే నాలుగు రోజు పాటు మృత్యువుతో పోరాడిన పాట్రిక్ దాన్ని జయించలేకపోయాడు. చివరకు పాట్రిక్ బుధవారం తుది శ్వాస విడిచాడు. పాట్రిక్ డే చనిపోయినట్టు అతని ప్రమోటర్ డిబెల్లా ఓ ప్రకటనలో తెలిపారు. పాట్రిక్ మృతిపై వరల్డ్ బాక్సింగ్ అసోసియేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పాట్రిక్ గాయాలు పాలై మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొంది.
నెల రోజుల వ్యవధిలో రష్యా చెందిన బాక్సర్ మాక్సిమ్ డడ్షెవ్, అర్జెంటీనాకు చెందిన హుగో సాంతిల్లాన్లు కూడా ప్రత్యర్థి పిడుగుద్దులకు బలయ్యారు. సుబ్రియేల్ మాటియాస్ చేతిలో చావు దెబ్బలు తిని గాయాలతో చికిత్స పొందుతూ రష్యన్ బాక్సర్ మాక్సిమ్ డడ్షెవ్ అమెరికా ఆసుపత్రిలో మృతి చెందాడు. నాలుగు రోజులు చికిత్స అనంతరం అతడు మరణించాడు. ఉరేగ్వే బాక్సర్ ఎడ్వర్డో అబ్రెతో జరిగిన మ్యాచులో సాంతిల్లాన్ గాయపడ్డాడు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో సర్జరీ చేశారు. అయితే అది విఫలం కావడంతో గుండు పోటుకు గురైన సాంతిల్లాన్ మరణించాడు.