|
భారతదేశానికే గర్వకారణం:
'పీవీ సింధు అద్భుత ప్రదర్శనకు మనమందరం సంతోషంగా ఉన్నాము. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించినందుకు ఆమెకు అభినందనలు. సింధు భారతదేశానికి గర్వకారణం. అత్యద్భుతమైన ఒలింపియన్లలో ఆమె కూడా ఒకరు' అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 'పీవీ సింధు.. రెండు ఒలింపిక్స్లో వరుసగా పతకాలు సాధించిన తొలి మహిళ. స్థిరత్వం, అంకిత భావంలో ఆమె కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారతదేశానికి కీర్తి తీసుకొచ్చిన సింధుకు నా హృదయపూర్వక అభినందనలు' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
|
మేము గర్విస్తున్నాం:
భారతదేశం గర్వించేలా పీవీ సింధు విజయం సాధించిందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్ అన్నారు. రెండు పతకాలు సాధించిన రెండో అథ్లెట్ సింధు అని చెప్పారు. మీరాబాయ్ చాను, పీవీ సింధు పతకాలు గెల్చుకున్నారు. బాక్సర్ లవ్లీనా కూడా పతకం గెలుస్తుందని ఆశిస్తున్నా అని అనురాగ్ తెలిపారు. 'సింధు బాగా ఆడారు. ఆట పట్ల మీ అసమానమైన నిబద్ధత మరియు అంకిత భావంను పదే పదే నిరూపించారు. మీరు దేశానికి కీర్తిని తీసుకురావడం కొనసాగించండి. మీ అద్భుతమైన విజయానికి మేము గర్విస్తున్నాము' అని అమిత్ షా ట్వీట్ చేశారు.
|
అందరిని కలిపే పీవీ సింధు:
'టోక్యో ఒలింపిక్స్ 2020 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న పీవీ సింధుకు అబినందనలు. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలను సాధించిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించడం పట్ల సంతోషంగా ఉంది' అని తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 'భారతదేశానికి రెండో పతకం తెచ్చిన సింధుకు అభినందనలు' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీటారు. 'మా ఏస్ షట్లర్ మమ్మల్ని మళ్లీ గర్వపడేలా చేసింది. మీ విజయానికి అభినందనలు
సింధు. మేము ఎంతో గర్వపడుతున్నాము' అని పేర్కొన్నారు. 'క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, హిందూలను కలిపే పీవీ సింధు. రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళ. అభినందనలు సింధు' అని సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీటాడు.
|
సరికొత్త రికార్డు:
ఒలింపిక్స్ 2020లో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఆదివారం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు పూర్తి ఆధిక్యం కనబర్చింది. వరుస గేమ్స్లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. 2016 రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన సింధు.. టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం గెలుచుకుంది.