హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం పతకం గెలిచినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు అన్నారు. దేశానికి ఓ మెడల్ తీసుకొచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఏడాది పాటు కుటుంబానికి దూరంగా ఉంటూ తనకు శిక్షణ ఇచ్చిన కోచ్ పార్క్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని స్వదేశానికి వచ్చిన సింధు.. బుధవారం హైదరాబాద్లోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడారు.
IND vs ENG 1st Test: బెయిర్స్టో ఔట్.. టీ విరామానికి ఇంగ్లండ్ స్కోర్ 138! ఈ సెషన్లో రూట్దే హవా!!
'టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్యం పతకం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దేశానికి ఓ మెడల్ తీసుకొచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కోచ్ పార్క్కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఏడాది పాటు నా ఆట కోసం ఆయన ఎంతో కృషి చేశారు. కరోనా మహమ్మారి పరిస్థితుల్లోనూ ఏడాదిగా కొరియాకు వెళ్లకుండా.. కుటుంబానికి దూరంగా ఉంటూ నాకు శిక్షణ ఇచ్చారు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. వారు కూడా క్రీడాకారులు కావడం వల్లే నన్ను ప్రోత్సహించారు. నా విజయం వెనుక సుచిత్రా అకాడమీ కృషి కూడా ఎంతో ఉంది' అని పీవీ సింధు తెలిపారు.
అంతకుముందు ఢిల్లీలో పీవీ సింధు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 'రెండు పతకాల ఆనందం నాలో ఉంది. ఈ సందర్భాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నా. ఈ విజయాన్ని జీవితాంతం మర్చిపోలేను. ఒలింపిక్స్లో వరుసగా పతకాలు గెలవడం గొప్ప విజయం. ఆటలో రాణించేందుకు ఇతరులకు ఇది ప్రేరణనిస్తుందనే అనుకుంటున్నా. మున్ముందు చాలా అంతర్జాతీయ టోర్నీలు ఉన్నాయి. త్వరలోనే సాధన మొదలు పెడతాను. అత్యుత్తమంగా ఆడాలన్నదే నా లక్ష్యం. స్పెయిన్లో ప్రపంచ ఛాంపియన్షిప్ జరగబోతోంది. అందులో మెరుగ్గా ఆడాలని అనుకుంటున్నా. ప్యారిస్ ఒలింపిక్స్లో కచ్చితంగా ఆడతా. దానికి ఇంకా సమయం ఉంది' అని తెలుగు తేజం వివరించారు.
ఈ సందర్భంగా సింధు కోచ్ పార్క్ మాట్లాడుతూ... ఆటగాడిగా సాధించలేనిది కోచ్గా సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. సింధును అందరూ అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్షణాలను జీవితంలో మరిచిపోనని పార్క్ తెలిపారు. ఒలింపిక్స్ ఉన్నాయని పార్క్ గతేడాది కాలంగా కొరియా వెళ్లలేదు. ఇప్పుడు సింధు పతకం తేవడంతో ఆయన సంతోషంగా త్వరలోనే స్వదేశానికి వెళ్లనున్నారు. టోక్యో ఒలింపిక్స్లో సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. గత ఆదివారం హి బింగ్జియావో ( చైనా)తో జరిగిన మ్యాచ్లో 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో గెలిచి కాంస్య పతకం సాధించింది.