
ఢిల్లీ: రిటైరవుతున్నానంటూ భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సామాజిక మాధ్యమాల్లో చేసిన ఓ ప్రకటన సంచలనం సృష్టించింది. సింధు చేసిన ప్రకటనపై అభిమానులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ట్విట్టర్, ఇన్స్టా వేదికగా 'నేను రిటైరయ్యాను' అని సింధు చేసిన పోస్ట్ గందరగోళానికి గురి చేసింది. అయితే అది బ్యాడ్మింటన్ ఆటకు పూర్తిగా గుడ్ బై చెప్పిన ప్రకటన కాదని తర్వాత తెలియడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ సమయంలో వ్యంగ్యం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.
పీవీ సింధు చేసిన ప్రకటనపై కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజుజు స్పందించారు. సింధు.. మినీ షాకిచ్చావ్ అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 'సింధు.. నువ్వు మినీ షాకిచ్చావ్. నీ శక్తిసామర్థ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను కచ్చితంగా చెప్పగలను.. నీ బలం, నీ శక్తితో మరెన్నో విజయాలను భారత్కు అందిస్తావని ఆశిస్తున్నా' అని కిరెన్ రిజుజు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతానికి చిన్న బ్రేక్ ఇస్తున్నాననే క్రమంలోనే పీవీ సింధు 'ఐ రిటైర్' అంటూ పోస్ట్ చేసి గందరగోళానికి తెరతీసింది. ఇంత ఆకస్మికంగా సింధు ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదిలింది. డెన్మార్క్ ఓపెన్ చివరది అంటూ వెల్లడించడం ఇంకా అయోమయానికి గురి చేసింది. కాగా కరోనా కారణంగా ఆటకు కాస్త విరామం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సింధు ఇలా చేసిందని అందరూ భావిస్తున్నారు. కిరన్ రిజుజు ట్వీటర్ పోస్ట్ కూడా సింధు పూర్తిగా ఆటకు స్వస్తి పలకలేదని విషయాన్ని స్పష్టం చేసింది.
రిటైర్మెంట్ ప్రకటన కరోనా వైరస్ ప్రభావాన్ని గురించి అని, తన గురించి కాదని పీవీ సింధు స్పష్టం చేశారు. తన పోస్టు పట్ల అభిమానుల ఆందోళనను అర్థం చేసుకోగలనని.. తన ఉద్దేశం తెలుసుకొనేందుకు ఆ పోస్టును పూర్తిగా చదవాల్సిందిగా ఆమె కోరారు. అనంతరం వారు తనకి మద్దతుగా నిలుస్తారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. కఠినమైన ప్రత్యర్థులను కూడా చివరి వరకు నిలిచి ఎదిరించేలా శిక్షణ పొందానని, అయితే కనబడకుండా ప్రపంచాన్నంతటిని వేధిస్తున్న కరోనా మహమ్మారిని ఎలా ఓడించాలని సింధు ప్రశ్నించారు. ఇన్ని నెలలు గడుస్తున్నా మనం బయటకు వెళ్లే ప్రతిసారి ప్రశ్నించుకోవాల్సి వస్తోందన్నారు. ఆన్లైన్లో తాను చదివిన అనేక విషాద ఘటనలు తన గురించి, ఈ ప్రపంచాన్ని గురించి అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయన్న సింధు.. డెన్మార్క్ ఓపెన్లో భారత్ తరపున ఆడలేకపోవటమే.. ఈ వరుస విషాదాలలో చివరిది కావాలనేది తన పోస్టు ఉద్దేశమని వివరించారు.