సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ 2022 టోర్నమెంట్లో తెలుగుతేజం పీవీ సింధు తన దూకుడును కొనసాగిస్తోంది. క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన హాన్ యుయెను మట్టి కరిపించిన మరుసటి రోజే మరో తిరుగులేని విజయాన్ని అందుకుంది. సెమీ ఫైనల్స్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. అరగంటలోనే గేమ్ను ముగించేసింది. 21-15, 21-7 సెట్ల తేడాతో జపాన్కు చెందిన సయీనా కవకమిని ఓడించింది. ఈ గేమ్ 31 నిమిషాల్లోనే ముగిసిందంటే- పీవీ సింధు దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
క్వార్టర్ ఫైనల్స్లో కాస్త తడబడినట్టు కనిపించిన సింధు.. సెమీస్లో మాత్రం చెలరేగింది. మ్యాచ్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కమకమికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఒలింపిక్స్లో రెండుసార్లు భారత్కు పతకాన్ని అందించిన సింధు విజృంభణ ముందు కమకమి నిలవలేకపోయింది. తొలి సెట్లో కాస్త ప్రతిఘటించినప్పటికీ.. రెండో సెట్లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. 15-21 తేడాతో తొలి సెట్ను సింధుకు ధారదాత్తం చేసిన జపాన్ స్టార్ షట్లర్.. రెండో సెట్లో చతికిలపడింది. 7-21 తేడాతో ఆ సెట్ను కోల్పోయింది.
FINALS FOR SINDHU 🔥👑@Pvsindhu1 puts up exemplary performance to comfortably beat 🇯🇵's S Kawakami 21-15, 21-7 in just 31 minutes and cruise through to the summit clash of #SingaporeOpen2022 ✅
— BAI Media (@BAI_Media) July 16, 2022
Go for 🥇 champ!#SingaporeOpenSuper500#IndiaontheRise#Badminton pic.twitter.com/douunXYItC
ఇక ఫైనల్స్లో పీవీ సింధు ప్రత్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. అయా ఒహిరి-వాంగ్ ఝీ యి మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్స్లో విజేతను ఫైనల్స్లో పీవీ సింధు ఎదుర్కొంటుంది. అయా ఒహిరి-వాంగ్ ఝీ యి మధ్య రెండో సెమీ ఫైనల్స్ ఇంకాస్సేపట్లో ప్రారంభమౌతుంది. క్వార్టర్ ఫైనల్స్లో హాన్ యుయెను ఎదుర్కొన్న పీవీ సింధు తడబడిన విషయం తెలిసిందే. తొలి సెట్ను 17-21 పాయింట్ల తేడాతో కోల్పోయింది. చివరి రెండు సెట్లల్లో ఆమెకు ఎదురు లేకుండాపోయింది. 21-11, 21-19 పాయింట్లతో సెమీస్లో విజయం సాధించింది.
ఈ ఏడాది మేలో జరిగిన థాయ్లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్స్లో ప్రవేశించిన తరువాత పీవీ సింధు మళ్లీ అలాంటి రికార్డును నెలకొల్పడం ఇదే తొలిసారి. ఈ నెల చివరి నుంచి బర్మింగ్హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్న నేపథ్యంలో పీవీ సింధు ఫుల్ ఫామ్లోకి రావడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. ఇదే విజృంభణ గనక ఆమె ఫైనల్స్లోనూ కొనసాగించగలిగితే- ప్రతిష్ఠాత్మక సింగపూర్ ఓపెన్ 2022 టైటిల్.. భారత్ వశమౌతుంది.