హైదరాబాద్: భారత దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 649, తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తన వంతు సాయం అందించడానికి కూడా ముందుకొచ్చారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు తన మానవత్వాన్ని చాటుకుంది.
పాక్ క్రికెటర్ల మంచి మనసు.. కరోనా కోసం భారీ విరాళం!!
కరోనాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి పీవీ సింధు విరాళాలు ప్రకటించింది. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు అందిస్తానని ఆమె ట్వీట్ ద్వారా వెల్లడించింది. 'కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కు చెరో రూ .5,00,000 విరాళంగా ఇస్తున్నా' అని గురువారం ట్వీట్ చేసింది.
తాజాగా హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన 'సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్'ను సింధు స్వీకరించిన విషయం తెలిసిందే. చాలెంజ్లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సింధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 30 సెకండ్లు సింధు చేతులు శుభ్రం చేసుకుంది. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్రపరుచుకోవాలంది. ఇక కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఈ చాలెంజ్ను స్వీకరించాలని కోరింది.
I hereby donate an amount of Rs 5,00,000/- each (Rs five lakhs ) towards the "Chief Ministers Relief Fund"
— Pvsindhu (@Pvsindhu1) March 26, 2020
for the States of Telangana and Andhra Pradesh to fight against COVID-19. @TelanganaCMO @AndhraPradeshCM
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన రోజుకూలీలను ఆదుకోవడం కోసం విరాళాలు సేకరించడానికి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ముందుకొచ్చింది. ఈ కష్టకాలంలో వారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చింది. 'సఫా' స్వచ్ఛంద సంస్థ, మరికొంత మందితో కలిసి కూలీలకు సాయం చేయాలని సానియా నిర్ణయించుకున్నట్టు తెలిపింది. సంపన్నులు, ఉద్యోగులు వారి సమీపంలోని పేద కుటుంబాలకు సహాయం చేయాలని సానియా కోరింది.