హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్ సత్తాచాటుతుందని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతం కంటే మెరుగ్గా.. భారత్ రెట్టింపు పతకాలను సాధిస్తుందన్నారు. బ్యాడ్మింటన్లో తెలుగు షట్లర్ పీవీ సింధు మెడల్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సింధు మాత్రమే కాదు ఈసారి క్రీడాకారులంతా తమదైన ప్రదర్శనతో భారత్ పేరును నిలబెడతారని గోపీచంద్ పేర్కొన్నారు. జూన్ 23న టోక్యో ఒలింపిక్స్ ఆరంభం కానున్నాయి. ఈసారి అత్యధిక సంఖ్యలో భారత్ నుంచి 127 మంది అథ్లెట్లను టోక్యోకు పంపిన విషయం తెలిసిందే.
'లండన్ ఒలింపిక్స్లో భారత్ ఆరు పతకాలు గెలుచుకుంది. ఈసారి పతకాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రభుత్వం నుంచి క్రీడాకారులకు ఎంతో మద్దతు ఉంది. షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్.. ఏ రంగంలో చూసినా పతక అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్యాడ్మింటన్లో రియో, లండన్ ఒలింపిక్స్లో సాధించిన దానికంటే ఈ సారి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పీవీ సింధు కచ్చితంగా పతకం సాధిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈసారి స్వర్ణం సాధించేవారి జాబితాలో సింధు ముందుంటుంది' అని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు.
సాయి ప్రణీత్ గత ప్రపంచ ఛాంపియన్షిప్లో అంచనాలను అందుకున్నాడని, గత ఫామ్ను ప్రస్తుతం కూడా కొనసాగిస్తాడని పుల్లెల గోపీచంద్ ధీమా వ్యక్తం చేశారు. డబుల్స్లో చిరాగ్-సాత్విక్ జోడీ కూడా పతకం సాధించే వారిలో ఉన్నారన్నారు. ఇక పీవీ సింధుకు ఆమె పేరెంట్స్ బెస్ట్ విషెస్ చెప్పారు. ఒలింపిక్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఆ విషెస్ వీడియోను పోస్టు చేశారు. సింధుకు అద్భుతమైన సపోర్ట్ ఇచ్చే వ్యవస్థ ఉన్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తమ ట్వీట్లో పేర్కొన్నారు. 24వ తేదీ నుంచి బ్యాడ్మింటన్ మ్యాచ్లు ప్రారంభంకానున్నాయి.
తాజాగా వర్చువల్ ఇంటరాక్షన్లో పీవీ సింధు మాట్లాడుతూ.. కరోనా విరామం తన ఆటను మెరుగుపరిచిందని తెలిపారు. సాంకేతికత మరియు నైపుణ్యాలపై మరింత దృషి పెట్టడానికి తనకు చాలా సమయం దొరికిందని పేర్కొన్నారు. మహిళల సింగిల్స్లో ఆరో సీడ్గా బరిలో ఉన్న సింధు.. ప్రపంచ నంబర్ 34 చిగ్ గన్ యై, సెనియా పొలికర్పొవా తో లీగ్ దశలో తలపడనున్నారు. జులై 25న పొలికర్పొవా (ఇజ్రాయెల్)తో సింధు తొలి మ్యాచ్ ఆడనున్నారు. గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్.. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడ్డాయి. వైరస్ ఉద్ధృతి కాస్త నెమ్మదించడం వల్ల జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో కొవిడ్ నియమ నిబంధనలతో జరగనున్నాయి.