
హైదరాబాద్: జనవరి 20 నుంచి ఆరంభమయ్యే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ఐదో సీజన్ షెడ్యూల్లో నిర్వాహాకులు స్వల్ప మార్పులు చేశారు. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు అంచె పోటీలు ఫిబ్రవరి 5 నుంచి 6 వరకు... ఆ తర్వాత ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో రెండు సెమీఫైనల్స్తో పాటు 9న జరిగే ఫైనల్ను బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో జరిగేలా షెడ్యూల్ రూపొందించారు.
అయితే, అదే సమయంలో స్టేడియం అందుబాటులో ఉండడం లేదని అక్కడ మ్యాచ్లను నిర్వహించడం కష్టమని బెంగళూరు రాప్టర్స్ జట్టు గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేసింది. దీంతో బెంగళూరు అంచె మ్యాచ్లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్ను హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నిర్వాహకులు శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.
అసలు షెడ్యూల్ ప్రకారం జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు హైదరాబాద్ మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది. అయితే, కొత్త షెడ్యూల్ ప్రకారం మరో 15 మ్యాచ్లకు అదనంగా హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. మొత్తంగా తాజా సీజన్లో హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్ల సంఖ్య పెరగడం బ్యాడ్మింటన్ అభిమానులకు పండుగే.
సెమీస్, ఫైనల్ మ్యాచ్లు ముందుగా నిర్ణయించిన తేదీల్లో హైదరాబాద్లోనే జరుగుతాయి. పీబీఎల్ ఐదో సీజన్ ఈ నెల 20న చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది. 24 వరకు చెన్నైలో మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత జనవరి 25 నుంచి 28 వరకు లక్నో అంచె పోటీలు ఉంటాయి.