పీఎన్బీ మెట్లైఫ్కు ప్రచారకర్తగా:
గురువారం హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటళ్లో జరిగిన పీఎన్బీ మెట్లైఫ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఐదో సీజన్ ప్రారంభ కార్యక్రమానికి సింధు ముఖ్య అతిథిగా హాజరైంది. పీఎన్బీ మెట్లైఫ్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సింధు ఈ సందర్భంగా మాట్లాడారు. 'చిన్నారుల్లోని బ్యాడ్మింటన్ ప్రతిభను వెలికితీయడానికి పీఎన్బీ మెట్లైఫ్ ఈ ఛాంపియన్షిప్ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆన్ లైన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తూ షట్లర్ల నైపుణ్యాలు మెరుగయ్యేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది' అని సింధు అన్నారు.
మెరుగ్గా రాణిస్తా:
'ఈ సీజన్ గొప్పగా ఏమీ సాగలేదు. అయినా నేను సంతృప్తిగానే ఉన్నా. ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. కానీ కొన్ని సార్లు మనం 100 శాతం ప్రదర్శన ఇవ్వకపోవచ్చు. ఆటలో తప్పులు కూడా జరిగిపోతుంటాయి. ఫలితాలతో కొంత బాధపడ్డా. నెల విరామంలో పూర్తిగా శిక్షణపైనే దృష్టి పెట్టా. కొరియా మహిళల కోచ్ కిమ్ జి హ్యూన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నా. త్వరలో జరగనున్న టోర్నీల్లో మెరుగ్గా రాణిస్తాననే నమ్మకం ఉంది' సింధు పేర్కొన్నారు.
ప్రత్యర్థులు ఆటను పట్టేస్తున్నారు:
'ఇప్పుడు ఆటతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండటం అవసరం. మ్యాచ్లు సుదీర్ఘంగా సాగుతున్నాయి, అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. వీడియో రికార్డింగ్లతో ప్రత్యర్థులు మన ఆటను పట్టేస్తున్నారు. మన ఆటను, శైలిని మార్చుకోవాల్సి వస్తోంది. సీనియర్, జూనియర్ క్రీడాకారిణులు గొప్పగా ఆడుతున్నారు. వాళ్లను ఎదుర్కోవాలంటే మన ఆటను మెరుగుపరుచుకోవాల్సిందే. వచ్చే ఏడాది ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి మ్యాచ్ ముఖ్యమైందే. టోక్యో ఒలింపిక్స్ బరిలో దిగి ఉత్తమ ఫలితాలు సాధించాలనేదే లక్ష్యం' అని సింధు చెప్పుకొచ్చారు.