పారిస్: భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్లో సంచలన విజయం నమోదు చేశారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ జోడీని, క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంక్ ద్వయంను బోల్తా కొట్టించిన భారత యువ జోడి సాత్విక్-చిరాగ్ సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో భారత జోడీ 21-11, 25-23తో ఐదో సీడ్, ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆరో స్థానంలో ఉన్న హిరోయుకి ఎండో-యుటా వతనాబె (జపాన్) జంటను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది.
50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సాత్విక్-చిరాగ్ జోడి ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. తొలి గేమ్లో 9-5 నుంచి 13-7కి చేరుకున్న భారత జోడీ ఆ తర్వాత మరింత జోరు పెంచింది. జపాన్ ద్వయానికి అవకాశమే ఇవ్వకుండా తొలి గేమ్ను 21-11తో గెలిచింది. రెండో గేమ్లో తొలుత 0-3తో వెనుకబడిన సాత్విక్-చిరాగ్ తర్వాత పుంజుకున్నారు. 5-8తో వెనుకబడిన సమయంలో వరుసగా 6 పాయింట్లు సాధించి బ్రేక్ సమయానికి 11-8తో నిలిచారు.
విరామం తర్వాత జపాన్ జోడీ పుంజుకోవడంతో స్కోర్లు 14-14తో సమమయ్యాయి. ఆ తర్వాత కూడా కూడా 20-20తో స్కోర్ సమం అయింది. ఇక ఇరు జోడీలు ఒక్కో పాయింట్ సాధించడంతో 23-23తో స్కోర్లు సమమైన సమయంలో.. భారత ద్వయం వరుసగా రెండు పాయింట్లు సాధించి 25-23తో రెండో గేమ్ను గెలిచి జయకేతనం ఎగురవేసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది. గతంలో ఈ జపాన్ జోడీతో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన సాత్విక్-చిరాగ్ మూడో ప్రయత్నంలో మాత్రం విజయం సాధించారు.
ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ గిడియోన్-కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా) జోడీతో సాత్విక్-చిరాగ్ జంట ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో భారత జంట 0-6తో వెనుకబడి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల తర్వాత జరగనుంది. మ్యాచ్ స్టార్స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇండోనేసియా ప్లేయర్ జొనాథన్ క్రిస్టీ అత్యద్భుత విజయం సాధించాడు. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో 7-21, 22-20, 21-19తో గెలుపొంది ఫైనల్లోకి దూసుకెళ్లాడు.