హైదరాబాద్: ఇటీవలే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గెలిచిన పీవీ సింధు ప్రస్తుతం జరుగుతున్న చైనా ఓపెన్లో కూడా దూసుకుపోతోంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై 21-18, 21-12తో విజయం సాధించి ప్రిక్వార్టర్కు చేరింది.
ఈ మ్యాచ్ని పీవీ సింధు కేవలం 34 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ప్రస్తుతం 20వ ర్యాంకులో ఉన్న షట్లర్ లీ జురుయ్పై సింధు అలవోక విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో థాయ్లాండ్ ఆటగాడు సుపన్యు అవిహింగ్సనన్పై 21-19, 21-23, 21-14 తేడాతో సాయి ప్రణీత్ విజయం సాధించాడు.
WC 2020: సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోని ఆ నలుగురు ఎవరు?
ఈ విజయంతో సాయి ప్రణీత్ రెండో రౌండ్కు అర్హత సాధించాడు. కాగా... మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఎన్.సిక్కిరెడ్డి జోడీ 12-12, 21-13 తేడాతో జర్మనీకి చెందిన మార్క్ లమ్స్ఫస్, ఇసబెల్ హెట్రిక్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు ఈ టోర్నీ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది.
చైనా ఓపెన్ ప్రారంభ రౌండ్లో 8వ సీడ్ సైనా ఓడిపోయింది. మహిళల సింగిల్స్లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్లో థాయ్లాండ్కు చెందిన క్రీడాకారిణి, ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ 10-21, 17-21తో సైనా నెహ్వాల్ను వరుస గేమ్లలో ఓడించింది.