
హైదరాబాద్: చైనా వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకర్, చైనీస్ తైపీ షట్లర్ తై జు యింగ్పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
రియో ఒలింపిక్స్ తర్వాత ఏడుసార్లు తై జు యింగ్తో తలపడిన పీవీ సింధు ఎట్టకేలకి తొలి విజయాన్ని సాధించింది. గ్రూప్-ఎ మహిళల సింగిల్స్ పోరులో భాగంగా గురువారం రెండో రౌండ్లో మ్యాచ్ జరగగా తొలి సెట్ని 21-14తో చేజిక్కించుకున్న తై జు ఆరంభంలోనే పీవీ సింధుని ఒత్తిడిలోకి నెట్టింది.
అయితే, ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న పీవీ సింధు 21-16తో రెండో సెట్లో గెలిచి 1-1తో ఆధిక్యాన్ని సమం చేసింది. ఇక, విజేత ఎవరో నిర్ణయించే మూడో సెట్లో ఇద్దరు షట్లర్లు నువ్వానేనా అంటూ పాయింట్ల కోసం పోటీపడ్డారు. చివర్లో తై జు యింగ్ వరుస తప్పిదాల కారణంగా పీవీ సింధు మూడో సెట్ని 21-18 చేజిక్కించుకుంది.
సుమారు 62 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ బ్యాడ్మింటన్ అభిమానుల్ని అలరించింది. కాగా, ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో వరల్డ్ రెండో ర్యాంకర్, జపాన్ షట్లర్ అకానె యమగూచీని చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఇక, పురుషుల సింగిల్స్లో తొలి మ్యాచ్లో ఓడిన సమీర్ వర్మ గురువారం జరిగిన మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్ టామి సుగియార్తోపై 21-16, 21-7 తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేశాడు.