
హైదరాబాద్: జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెంటో మొమోటా ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్లో అద్భుతాలు సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ను మొమోటా ఏలాడు. 2019లో కెంటో ఏకంగా 11 టైటిల్స్ సాధించాడు. ఫలితంగా బ్యాడ్మింటన్ చరిత్రలో ఒకే ఏడాదిలో 11 టైటిల్స్ నెగ్గిన తొలి షట్లర్గా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో గ్రేట్ లీ చోంగ్ వీ(మలేసియా), వాంగ్ జియోలి-యు యాంగ్(చైనా) 10 టైటిళ్ల రికార్డుని అధిగమించాడు. ఈ ఏడాది మిగతా షట్లర్లు పేలవ ప్రదర్శన చేసిన సమయంలో కెంటో మాత్రం తన అద్భుత ప్రదర్శనతో బ్యాడ్మింటన్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. టోర్నీ ఏదైనా సరే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది కెంటో మొత్తం 73 మ్యాచ్లు ఆడాడు. ఇందులో ఏకంగా 67 మ్యాచ్ల్లో విజయం సాధించాడు. దీనిని బట్టి కెంటో ఆట ఏ విధంగా సాగిందో ఓ అంచనాకు రావొచ్చు. 2019లో కెంటో ఎన్నో అద్భుతమైన విజయాలను నమోదు చేశాడు. ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో కూడా టైటిల్ను సొంతం చేసుకున్నాడు.
దీంతో పాటు చైనా మాస్టర్స్, డెన్మార్క్ ఓపెన్, కొరియా ఓపెన్, చైనా ఓపెన్, ప్రపంచ ఛాంపియన్షిప్, జపాన్ ఓపెన్, ఆసియా ఛాంపియన్షిప్, సింగపూర్ ఓపెన్, జర్మన్ ఓపెన్లలో విజేతగా నిలిచాడు. ఇలా, ఈ ఏడాది ఏకంగా 11 టైటిల్స్ గెలుచుకుని బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
2010లో లీ చోంగ్ వీ సింగిల్స్ విభాగంలో 10 టైటిల్స్ నెగ్గగా... 2011లో వాంగ్ జియోలి-యు యాంగ్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో 10 టైటిల్స్ సాధించింది. ఇక, ఈ ఏడాది పురుషుల డబుల్స్లో ఇండోనేషియాకు చెందిన హేంద్ర సెటివాన్-మొహమ్మద్ ఎహ్సాన్ల జోడీ తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
సెటివాన్(35), అహ్సాన్(32) వయసులో కూడా తమలో చేవ తగ్గలేదని నిరూపించారు. ప్రస్తుతం బీడబ్ల్యుఎఫ్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న ఈ జోడీ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేశారు. ఐదేళ్ల విరామం తర్వాత ఈ జోడీ ఆల్ ఇంగ్లాండ్ డబుల్స్ టైటిల్ నెగ్గి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాదు అనుభవానికి మించిన ప్రత్యామ్నాయం లేదని మరోసారి ఈ జోడీ చూపించింది. ఈ జోడీకి ఇది మూడో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కావడం విశేషం. BWF వరల్డ్ టూర్ ఫైనల్స్లో విజయం సాధించి ఈ ఏడాదిని ఘనంగా ముగించారు. ఫలితంగా ఈ దశాబ్దంలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పెద్ద వయస్కుడిగా సెటివాన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక, భారత షట్లర్లకు ఈ ఏడాది మిక్స్డ్ ఫలితాలనిచ్చింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ నెగ్గడమే కాస్త గొప్పగా చెప్పుకోదగ్గ విషయం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా ఈ టోర్నీలో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత సాధించింది.