

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ఫైనల్ను అధిగమించలేకపోయింది. ఆసియా గేమ్స్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్స్లో ఓటమిపాలైంది. దీంతో సింధు రజతంతోనే సరిపెట్టుకుంది.
ఫైనల్లో వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ చేతిలో 13-21, 16-21 తేడాతో వరుస గేమ్స్లో ఓడిపోయింది. అయితే, సింధు ఓడినప్పటికీ చరిత్ర సృష్టించింది. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో రజత పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధు అరుదైన ఘనత సాధించింది.
ఫైనల్స్లో సింధు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆట ప్రారంభం నుంచీ సింధు వెనుకంజలోనే ఉంది. తొలి గేమ్ 0-5తో వెనుకంజలో ఉన్న సింధు ఆ తర్వాత కాస్త పోరాడింది. కోర్టులో అత్యంత వేగంగా కదిలే తైజు కదలికలను సింధు అర్థం చేసుకోలేకపోయింది.
డ్రాప్ షాట్లు, స్మాష్లు ఆడుతూ సింధును ఒత్తిడికి గురి చేసిన తైజు తొలి గేమ్ను కేవలం 16 నిమిషాల్లోనే ముగించింది. ప్రత్యర్థి పదే పదే ఔట్ కొట్టడంతో వచ్చిన పాయింట్లు తప్ప సింధు సాధించిన పాయింట్లు తక్కువే అని చెప్పాలి. దీంతో సింధు 13-21తో తొలి సెట్ను కోల్పోయింది.
రెండో గేమ్లోనూ మొదటి నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో గేమ్లో సింధును కోర్టు నలుమూలలా పరుగెత్తించడంతో ఆమె అలసిపోయినట్లు కనిపించింది. అక్కడక్కడా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడినా.. ప్రత్యర్థిపై పూర్తిగా పైచేయి సాధించకపోయింది.
దీంతో రెండో గేమ్ను సింధు 16-21తో ఓడిపోయి మ్యాచ్ను చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ 13 సార్లు తలపడగా 10సార్లు తైజుదే పైచేయి కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్లో సింధు విజయం సాధించడం ద్వారా ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజతం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది.
1982 తర్వాత సింగిల్స్లో పతకాలు గెలవడం ఇదే తొలిసారి. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్లోనే ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.