భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంగళవారం కీలక విషయాన్ని వెల్లడించింది. తన ముంజేయికి అలాగే మోచేయికి తీవ్రమైన గాయం అయినందున త్వరలో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ 2022 నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. 'హాయ్ గాయ్స్. మీకో అప్డేట్. ఇది చెప్పడానికి అంత గొప్ప వార్తేం కాదు. 2 వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు నా ముంజేయికి, మోచేతికి గాయమైంది. అయితే నేను అంత పెద్దగా ఈ గాయాలను పట్టించుకోలేదు. అయితే నేను నిన్న స్కాన్ చేయించుకుంటే అసలు విషయం తెలిసింది. దురదృష్టవశాత్తూ గాయం తీవ్రగా ఎక్కువ ఉందని తేలింది. ఎముకను పట్టి ఉండే కండర భాగం బాగా నలిగిపోయింది' అని సానియా తన ఇన్ స్టాలో పేర్కొంది.
'ఈ గాయం నుంచి క్యూర్ అయ్యేదాకా నేను కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోవాలి. అందువల్లే యూఎస్ ఓపెన్ నుంచి వైదొలిగాను. ఇలా జరగడం కాస్త బాధాకరమే. ఇది నాకు చాలా కష్ట సమయం. ఈ గాయం వల్ల యూఎస్ ఓపెన్ పూర్తయ్యాక టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటిద్దామనుకున్న నా ప్లాన్స్ అన్ని చెడిపోయాయి. అందువల్ల ప్రస్తుతం రిటైర్ అవ్వట్లేదు. మిగతా విషయాల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను' అని సానియా పేర్కొంది.
గత నెల ప్రారంభంలో.. సానియా మీర్జా వింబుల్డన్లో తన మిక్స్డ్ డబుల్స్ సెమీ-ఫైనల్లో ఓడిపోయింది. ఇక 2009లో, 2012లో మహేష్ భూపతితో కలిసి వరుసగా ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సానియా 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. 2014లో బ్రూనో సోరెస్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ యూఎస్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. ఇకపోతే ఈ యూఎస్ ఓపెన్ తర్వాత తాను రిటైర్ అవుతానని సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే సోమవారం నుంచి యూఎస్ ఓపెన్ ప్రారంభం కానుంది.