టెన్నిస్ టోర్నీల్లో ప్రతిష్ఠాత్మక గ్రాండ్ స్లామ్ అయిన వింబుల్డన్ టోర్నీ సెమీఫైనల్లో ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రోయేషియా భాగస్వామి పావిచ్తో కలిసి సెమీఫైనల్లో ఆడిన సానియా.. నీల్(బ్రిటన్), క్రాయెసిక్(అమెరికా) జోడీ చేతిలో పరాజయం పాలయింది. ఇక వింబుల్డన్ టోర్నీకి ఇక గుడ్ బై చెప్పిన సానియా.. తన కెరీర్లో వింబుల్డన్ టైటిల్ను మాత్రం ఒడిసిపట్టలేకపోయింది. సానియా ఖాతాలో లేని మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కేవలం వింబుల్డన్ ఒక్కటే. ఆరుసార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్గా నిలిచిన సానియా వింబుల్డన్లో టైటిల్ సాధించలేకపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 2009 ఆస్ట్రేలియా ఓపెన్, 2012లో ఫ్రెంచ్ ఓపెన్, 2014లో యూఎస్ ఓపెన్ టైటిళ్లు సానియా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో 2015లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియ ఓపెన్ టైటిల్స్ను గెలుచుకుంది.
బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్ సెమీఫైనల్లో ఓడిన తర్వాత వింబుల్డన్ ఛాంపియన్షిప్కు భావోద్వేగపూరితంగా ఆమె వీడ్కోలు పలికింది. మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్ చేరుకోవడం ఆమె అత్యుత్తమ ప్రదర్శన. WTA సర్క్యూట్లో ఇది తన చివరి సంవత్సరం అని సానియా ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టెన్నిస్కు పూర్తిగా వీడ్కోలు పలకనుంది. ఇక సెమీస్లో ఓటమి అనంతరం ఇన్స్టాగ్రామ్లోకి ఆమె ఓ భావోద్వేగ క్యాప్షన్ రాసింది.
'క్రీడలు మీ నుంచి చాలా తీసుకుంటాయి. మానసికంగా, శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని సిద్ధమయ్యేలా చేస్తాయి. గెలుపోటములు ఈ ప్రక్రియలో సాధారణం. గంటల తరబడి కష్టపడి ఓడిపోయిన తర్వాత కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు మిగులుతాయి. కానీ ఒక్కటి చెప్పగలను.. ఇతర ఉద్యోగాలు ఇవ్వలేనిది క్రీడలు మాత్రమే ఇచ్చేది అద్వితీయ ఆనందం. అందువల్ల క్రీడలకు(టెన్నిస్కు) నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. క్రీడలు సహజ కన్నీళ్లు ఇస్తాయి. సహజ ఆనందాన్నిస్తాయి. అలుపెరగని పోరాటాన్ని, మడమతిప్పని తెగువను అందిస్తాయి. గత 20ఏళ్లుగా వింబుల్డన్లో ఆడడం, గెలవడం నిజంగా ఎంతో గౌరవంగా ఉంది. ఇక వింబుల్డన్ను నేను మిస్ అవుతాను. మళ్లీ కలిసే వరకు ఇక సెలవు' అంటూ సానియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.