|
భారత్ ఖాతాలో మరో పసిడి..
మహిళల షూటింగ్ విభాగంలో భారత్ తాజాగా పసిడి పతకాన్ని గెలచుకుంది. ఈ కేటగిరీకి ప్రాతినిథ్యాన్ని వహించిన అవని లేఖరా బంగారు పతకాన్ని సాధించారు. ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు. టోక్యోలోని అసాకా షూటింగ్ రేంజ్లో జరిగిన రౌండ్-2, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 19 సంవత్సరాల అవని లేఖరా సరికొత్త చరిత్రను సృష్టించారు. 249.6 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. బంగారు పతకాన్ని అందుకున్నారు.
|
ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్..
పారాలింపిక్స్ షూటింగ్ విభాగంలో భారత్కు పసిడి పతకాన్ని అందించిన విమెన్ షూటర్గా అవని రికార్డు సృష్టించారు. కాగా.. 248.9 పాయింట్లతో చైనాకు చెందిన క్యూపింగ్ ఝాంగ్ రెండో స్థానంలో నిలిచారు. రజత పతకాన్ని అందుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఐరినా షెట్నిక్ మూడో స్థానంతో సరి పెట్టుకున్నారు. ఆమెకు కాంస్య పతకం దక్కింది. టోక్యో పారాలింపిక్స్లో భారత్ ఖాయంగా పతకాన్ని అందుకుంటుందనే అంచనాలు ఉన్న కేటగిరి ఇది.
|
రౌండ్ రౌండ్కూ ఆధిక్యత..
దీనికి కారణం.. అవని లేఖరా ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటమే. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 విభాగంలో అవని వరల్డ్ ర్యాంకింగ్లో టాప్-5లో కొనసాగుతోన్నారు. ప్రస్తుతం ఆమె ర్యాంకింగ్ నంబర్ 5. 2018 ఆసియన్ పారా గేమ్స్లో సింగిల్స్, మిక్స్డ్ విభాగాల్లో పాల్గొన్నారు. ఆ అనుభవం ఆమెకు టోక్యో పారాలింపిక్స్లో ఉపయోగపడింది. తొలి రౌండ్ నుంచీ అవని ఆధిక్యతను ప్రదర్శించారు. షూట్ చేసిన ప్రతిసారీ 10 పాయింట్ల స్కోర్ను అందుకున్నారు.
|
రాష్ట్రపతి, ప్రధాని హర్షం..
మూడు సెట్లుగా సాగిన ఈ ఎయిర్ రైఫిల్ షూటింగ్లో అవని 10 కంటే దిగువగా స్కోర్ను సాధించింది రెండుసార్లు మాత్రమే. ఇదో అసాధారణం. కాగా- అవని సాధించిన ఈ ఘన విజయం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమెను అభినందించారు. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తి ఇచ్చారని ప్రశంసించారు. అవని ఇచ్చిన స్ఫూర్తి చిరకాలం నిలిచి ఉంటుందని కితాబిచ్చారు. మరెందరికో ఆమె ఆదర్శప్రాయురాలుగా నిలిచారని అన్నారు.