ముంబై: భారత క్రికెటర్ రోహిత్ శర్మ ప్రో రెజ్లింగ్ లీగ్లో ఉత్తరప్రదేశ్ వారియర్స్ టీంకు సహ యజమానిగా రోహిత్ వ్యవహరించనున్నాడు. ప్రో రెజ్లింగ్ లీగ్లో ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఓ జట్టు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ లీగ్లోకి ప్రవేశించిన ప్రముఖుడు రోహితే కావడం గమనార్హం.
ఆరు నగరాలు కేంద్రంగా డిసెంబర్ 10 నుంచి అత్యంత అట్టహాసంగా ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 25, 26 తేదీల్లో సెమీస్ మ్యాచులు, 27న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నాయి.
లీగ్లో ఓ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'భారత్ రెజ్లింగ్ కు ఘనమైన చరిత్ర ఉంది. యూపీ వారియర్స్ టీమ్కు సహ యజమానిగా ఉండటం నిజంగా గర్వకారణం. భారత్లోనే అత్యంత ప్రముఖుడైన సుశీల్ కుమార్ మా జట్టులో ఉండటంతో తొలి లీగ్లో టాప్ స్థానాన్ని సాధిస్తామని విశ్వాసముంది' అని చెప్పారు.
ప్రోస్పోర్టిఫై డైరెక్టర్ విశాల్ గుర్నానీ మాట్లాడుతూ.. 'భారత క్రికెట్లో రోహిత్ శర్మ ఓ ప్రముఖ ఆటగాడు. యూపీ వారియర్స్లో కో ఓనర్గా రోహిత్ వ్యవహరించడం మాకు కలిసి వచ్చే అంశం. రోహిత్ శర్మ సహకారం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.
కాగా, ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్లెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు ఫుట్ బాల్ సూపర్ లీగ్లోని టీంలకు సహ యజమానులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ కూడా వారి బాటలోనే ప్రో రెజ్లింగ్ లీగ్లోని యూపీ వారియర్స్ కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.