న్యూఢిల్లీ: భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసారు. భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. జాతీయ క్రీడా నియమావళి ప్రకారం.. దేశంలోని ఏదైనా క్రీడా సమాఖ్యలో పదవి చేపట్టాలంటే క్రీడల్లో క్రియాశీలకంగా ఉండకూడదు.
డాట్ బాల్ వేస్తే.. విరాట్ కోహ్లీ స్లెడ్జ్ చేస్తాడు: బంగ్లా బౌలర్
తాను గతేడాది సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని
దీపా మాలిక్ తెలిపారు. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు ఆమె స్పష్టం చేసారు.
'ఎన్నికల్లో పాల్గొనేందుకు క్రీడల నుంచి వైదొలుగుతున్న విషయాన్ని గత సెప్టెంబరులోనే పీసీఐకి తెలియజేశా. పీసీఐ నూతన కమిటీ ఎన్నికకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తుండడంతో.. ఇంతకాలం నా రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించలేదు. కొత్త కమిటీకి కోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాంతో నూతన కమిటీకి క్రీడా శాఖ అనుబంధ గుర్తింపు కోసం ప్రయత్నించాల్సిన నేపథ్యంలో నా రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తున్నా' అని 49 ఏళ్ల దీపా మాలిక్ ట్వీట్ చేసారు.
పారా ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ దీపా మాలిక్. 2016 రియో పారాలింపిక్స్లో షాట్పుట్లో ఆమె రజత పతకం గెలుపొంది చరిత్ర సృష్టించారు. 2018లో దుబాయ్లో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో ఎఫ్-53/54 జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం నెగ్గారు. ప్రస్తుతం గుర్గావ్లో సహాయ కోచ్గా పని చేస్తున్న దీపా.. 58 జాతీయ, 23 అంతర్జాతీయ పతకాలు సొంతం చేసుకున్నారు. ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్రత్న (2019), పద్మశ్రీ (2017), అర్జున (2012) అవార్డులు ఆమెను వరించాయి.