
హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడల్లో పతకాల పంట పండుతోంది. మీరాబాయి చాను స్వర్ణంతో శుభారంభాన్ని అందించారు. తొలి పతకాన్ని పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజతంతో సంపాదించగా, మీరా బాయి స్వర్ణ పతకంతో సత్తా చాటింది.
దీంతో ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. 48 కిలోల విభాగంలో పోటీ పడిన మీరాబాయి మొత్తం 196 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్నాచ్ రౌండ్లో ప్రతి ప్రయత్నంలో కామన్వెల్త్ రికార్డును బ్రేక్ చేసిన 23 ఏళ్ల మీరాబాయి.. 80, 84, 86 కిలోల చొప్పున బరువులెత్తింది.
తొలుత స్నాచ్లో 86 కేజీలను ఎత్తిన చాను..ఆపై క్లీన్ అండ్ జర్క్లో 110 కేజీలను ఎత్తి సత్తాచాటారు. ఇక మారిషియన్ వెయిట్ లిఫ్టర్ రోల్యా రానైవోసోవా మొత్తం 170 కేజీలను ఎత్తి రజత పతకాన్ని సొంతం చేసుకోగా, మొత్తం 155 కేజీలతో శ్రీలంక లిఫ్టర్ దినుషా గోమ్స్ కాంస్య పతకంతో సంతృప్తి పడింది.
గతంలో 85 కిలోల బరువులెత్తడమే ఆమెకు బెస్ట్ కాగా.. ఈసారి ఆ రికార్డును తిరగరాసింది. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో ఏకంగా 110 కిలోల బరువెత్తింది. గతంలో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఈ మణిపురీ అమ్మాయి రజతం సాధించింది.
23ఏళ్ల చాను భారత రైల్వేలో సీనియర్ టికెట్ చెకర్గా పనిచేస్తున్నారు. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 194 కేజీలను ఎత్తి జాతీయ రికార్డును నెలకొల్పి స్వర్ణం గెలుచుకొని కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించింది. 22ఏళ్ల అనంతరం కరణం మల్లీశ్వరీ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత అమ్మాయి చానునే కావడం విశేషం.