‘స్వాఫ్’లో చేరికకు ఐదు సభ్య దేశాలు మద్దతు కావాలి:
ప్రతిపాదిత ‘స్వాఫ్'లో ఒకదేశానికి సభ్యత్వం లభించాలంటే సదరు గ్రూప్లోని ఐదు సభ్య దేశాలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), యెమెన్ మద్దతునిస్తేనే స్వాఫ్లో భారతదేశానికి చోటు లభిస్తుందని ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు.
25న స్వాఫ్ సభ్య దేశాల అధ్యక్షుల భేటీ
ఫుట్బాల్లో రీజనల్ గ్రూపింగ్ విస్తరణలో భాగంగా సదరు స్వాఫ్ పరిధిలోని పది దేశాల ఫుట్బాల్ సమాఖ్యల అధ్యక్షులు ఈ నెల 25వ తేదీన సమావేశమైన తర్వాత స్వాఫ్లో భారత్ చేరికపై స్పష్టత వస్తుంది. ‘స్వాఫ్'ను ఎఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ పది దేశాలతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడంతో భారతీయ ఫుట్బాల్ అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందని కుశాల్ దాస్ చెప్పారు. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (ఎస్ఎఎఫ్ఎఫ్)తోపాటు స్వాఫ్లో చేరికతో ఫుట్బాల్ సంబంధాల పెరుగుదలకు వీలవుతుందని కుశాల్ దాస్ అన్నారు. ‘స్వాఫ్'లో చేరడానికి ఆసియా ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సీ) ఆమోదం తెలిపిందని కుశాల్ దాస్ వివరించారు.
ఫుట్బాల్ అంటే సేల్ కాదు
క్లబ్ వరల్డ్ కప్లో సంస్కరణలు తేవాలని చేస్తున్న ప్రయత్నాల విషయమై కొన్ని సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం సరి కాదని సాల్వేనియాకు చెందిన యుఇఎఫ్ఎ అధ్యక్షుడు అలెగ్జాండర్ కేఫరిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిఫా అధ్యక్షుడు జియాన్ని ఇన్ఫాంటినో చొరవపై చికాకు పడ్డారు. న్యూ నేషన్స్ లీగ్ నిర్వహించాలన్న విషయమై కొన్ని క్లబ్లతోనే సంప్రదించడం సరి కాదన్నారు. జియీన్ని ఇన్ఫాంటినో కేవలం ఏడు క్లబ్లతో సంప్రదించడం సరి కాదని అలెగ్జాండర్ కేఫరిన్ చెప్పారు.
ఫుట్బాల్పై ఫిఫా హక్కులివ్వలేదు
‘ఫుట్బాల్ అంటే విక్రయానికి పెట్టిన వస్తువు కాదు. ఫిఫాకు యాజమాన్య హక్కులు రాసివ్వలేదు' అని అలెగ్జాండర్ కేఫరిన్ తెలిపారు. న్యూయార్క్లో జరిగిన సమావేశంలో లా లీగ, ప్రీమియర్ లీగ్ టోర్నీలకు చెందిన క్లబ్లు రియల్ మాడ్రిడ్, బార్సిలోనా, జువెంటస్, మాంఛెస్టర్ సిటీ, మాంఛెస్టర్ యునైటెడ్, పారిస్ సెయింట్ జెర్మైన్, బేయర్న్ మునిచ్ తదితర జట్ల యాజమాన్యాలతో జియాన్నీ ఇన్ఫాంటినో సంప్రదిస్తే మూడు క్లబ్ల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయని కేఫరిన్ గుర్తు చేశారు.