
హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బుధవారం 37వ పుట్టినరోజు జరుపుకున్నాడు. టీమిండియాకు రెండు ప్రపంచకప్లు(వరల్డ్ టీ20, వన్డే వరల్డ్ కప్) అందించడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్కు సోషల్ మీడియాలో ప్రస్తుత, మాజీ క్రికెటర్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
18 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి అనతికాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఫినిషర్గా, ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మన్గా... ఆల్రౌండర్గా భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. యువీ అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన సంఘటన.
అంతేకాదు క్యాన్సర్ను జయించిన వీరుడు. ఏప్రిల్ 2, 2011న యువీకి క్యాన్సర్ ఉందని గుర్తించారు. శస్త్రచికిత్స అవసరం లేదనడంతో ఊపిరి పీల్చుకున్న యువరాజ్ సింగ్కు మూడు దశలుగా కీమోథెరపీ చికిత్స అందించారు. అనంతరం యువీకెన్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్తో బాధపడే చిన్నారులు, పేదలు ఎంతో మందికి సాయం చేశాడు.
తన 37వ పుట్టినరోజు సందర్భంగా యువరాజ్ ఓ ప్రతిజ్ఞ చేశాడు. క్యాన్సర్తో బాధపడుతున్న 25 మంది చిన్నారుల వైద్యానికి సాయం అందిస్తానని పేర్కొన్నాడు. తన స్వచ్ఛంద సంస్థ యువీకెన్ ద్వారా సాయం చేస్తానని చెప్పాడు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. బర్త్ డే రోజున యువీ మంచి నిర్ణయం తీసుకున్నాడని అభినందిస్తున్నారు.
అందుకు సంబంధించిన వీడియో మీకోసం...