
టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు ధన్యవాదాలు చెబుతూ ట్విట్టర్ వేదికగా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. క్యాన్సర్ను జయించి యువరాజ్ సింగ్ కోలుకున్న విధానం ఒక్క క్రికెట్లోనే కాకుండా అన్ని రంగాల వారికి స్పూర్తిదాయకం అంటూ ఈ సందర్భంగా కోహ్లీ కొనియాడాడు. యువరాజ్ సింగ్ ఎల్లప్పుడూ ఉదారంగా ఉండే వ్యక్తి అని, తన చుట్టూ ఉండే వారి పట్ల శ్రద్ధ వహిస్తాడని చెప్పుకొచ్చాడు. యువరాజ్ సింగ్ సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ తన ట్వీట్లో తెలిపాడు. కాగా 2011లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు ఆ జట్టులో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ సభ్యలుగా ఉన్నారు.
ఇటీవల విరాట్ కోహ్లీకి టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ గోల్డెన్ షూస్ కానుకగా పంపి ట్విట్టర్ వేదికగా అతనిపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. కోహ్లీని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ వేదికగా యువరాజ్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ క్రికెటర్గా, వ్యక్తిగా ఎదగడం తాను చూశాశనని ఆ పోస్టులో యువీ తెలిపాడు. భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి నెట్స్లో భుజం భుజం రాసుకు తిరిగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచే లెజెండ్గా తయారయ్యాడని కొనియాడాడు. మైదానంలో కోహ్లీ క్రమశిక్షణ, అభిరుచి, క్రికెట్ పట్ల అంకితభావం ఈ దేశంలోని ప్రతి చిన్న పిల్లవాడిని క్రికెట్ ఎంచుకొని ఏదో ఒక రోజు నీలిరంగు జెర్సీని ధరించాలని కలలు కనేలా ప్రేరేపిస్తుందని యువీ చెప్పుకొచ్చాడు.
కాగా గురువారం నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే లంకతో జరిగే 2 మ్యాచ్ల టెస్టు సిరీస్కు మాత్రం కోహ్లీ అందుబాటులో ఉండనున్నాడు. ఇక కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ.. శ్రీలంకతో ఆడే తొలి టెస్ట్ మ్యాచ్తో 100 టెస్టుల క్లబ్లోకి చేరబోతున్నాడు. దీంతో కోహ్లీ వందో టెస్టు కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.