హైదరాబాద్: బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్లో టీమిండియాకు ఇదే తొలి ఓటమి. ఈ ఓటమితో టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు టీమిండియా 972 వన్డేలు ఆడింది. అందులో 505 విజయాల్ని సాధించగా, 418 పరాజయాల్ని ఎదుర్కొంది. ఇక 40 మ్యాచ్లు రద్దు కాగా, 9 మ్యాచ్లు టైగా ముగిశాయి. దీంతో వన్డేల్లో టీమిండియా విజయాల శాతం 54.66గా ఉంది.
ఇది మూడో అత్యుత్తమం కావడం విశేషం. మరోవైపు టీమిండియా పరాజయాల సంఖ్య 418కి చేరడంతో ఓ ప్రపంచ రికార్డు కూడా వచ్చి చేరింది. వన్డే చరిత్రలో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంకతో కలిసి టీమిండియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో 338 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లియాం ప్లెంకెట్ మూడు వికెట్లు తీయగా... క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీశాడు. తాజా విజయంతో ఇంగ్లాండ్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. చివరి మ్యాచ్లో న్యూజిలాండ్తో గెలిస్తే ఇంగ్లాండ్ సెమీస్కు చేరుతుంది.
ఇక, ఈ మెగా టోర్నీలో కోహ్లీసేన ఇంకా బంగ్లాదేశ్, శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్కు వెళ్తుంది. అంతకముందు జానీ బెయిర్ స్టో(111) సెంచరీ సాధించగా బెన్ స్టోక్స్(79), జేసన్ రాయ్(66) హాఫ్ సెంచరీలతో మెరవగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటగా... బుమ్రా, కుల్దీప్లు తలో వికెట్ తీశారు.