అహ్మదాబాద్: ఐపీఎల్ 2022 సీజన్లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఫైనల్స్కు కూడా ఇదే వేదిక. ఇదే పిచ్పై ఫైనల్స్ ఆదివారం రాత్రి 8 గంటలకు షెడ్యూల్ అయింది. గుజరాత్ టైటాన్స్ ఇదివరకే ఫైనల్స్కు చేరుకోగా.. దాన్ని ఢీ కొట్టేదెవరనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది. రెండో క్వాలిఫయర్లో గెలిచిన జట్టు ఫైనల్స్కు వెళ్తుంది.
ఐపీఎల్లో వస్తోన్న ట్రెడీషన్ ప్రకారం చూసుకుంటే- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్కు చేరే అవకాశం దాదాపు లేనట్టే అనుకోవచ్చు. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ప్రతీసారీ ఫైనల్స్కు వెళ్లింది. తొలి స్థానాన్ని ఆక్రమించిన జట్లు క్వాలిఫయర్ దశలోనే ఇంటిదారి పట్టిన మ్యాచ్లు లేకపోలేదు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండీ క్వాలిఫయర్ దశలో ఓటమిబాట పట్టాయి కొన్ని టీమ్స్.
మూడు, నాలుగు స్లాట్లల్లో వచ్చిన జట్లు కూడా క్వాలిఫయర్, ఎలిమినేటర్ దశలోనే తిరుగుముఖం పట్టాయి గానీ.. రెండో స్థానంలో నిలిచిన టీమ్ మాత్రం ఐపీఎల్ ఫైనల్స్లో అడుగు పెడుతూ వస్తోంది ఇప్పటివరకు కూడా. ఐపీఎల్లో ప్లేఆఫ్స్ సిస్టమ్ను ప్రవేశపెట్టినప్పటి నుంచీ ఇది ఓ సంప్రదాయంగా.. ఓ ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా? లేక ఆ సంప్రదాయానికి బ్రేక్ పడుతుందా? అనేది ఆసక్తికరం.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తొలి క్వాలిఫయర్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్స్కు చేరింది. ఇక ఆ జట్టును ఢీ కొట్టేది రెండో స్థానంలో ఉంటూ లీగ్ దశను ముగించుకున్న రాజస్థాన్ రాయల్సే అనేది ఐపీఎల్ ప్లేఆఫ్స్ చెబుతున్న చరిత్ర. రాజస్థాన్ రాయల్స్తో తలపడే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిని ఈ ఐపీఎల్ సంప్రదాయం శాసిస్తుందా? లేదా? అనేది ఈ రాత్రికి తేలిపోతుంది.