గ్రీన్ పిచ్ చూసినప్పుడల్లా బిర్యానీ తింటాడు:
భారత మహిళా యువ క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధానలు 'ద డబుల్ ట్రబుల్' అనే టాక్ షోను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకు రోహిత్ శర్మ హాజరయ్యాడు. ఈ సందర్భంగా టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ గురించి చర్చ రాగా.. రోహిత్ తన అనుభవాలను పంచుకున్నాడు. 'నెట్ సెషన్ల కోసం మాకు ఏర్పాటు చేసిన పిచ్లు ఎల్లప్పుడూ తేమతో కూడి ఆకుపచ్చగా ఉంటాయి. షమీ గ్రీన్ పిచ్ను చూస్తే రెచ్చిపోతాడు. ఆరోజు షమీ అదనపు బిర్యానీ తింటాడు' అని తెలిపాడు. షమీ గ్రీన్ పిచ్పై ప్రమాదకారి అని రోహిత్ పేర్కొన్నాడు. జస్ప్రీత్ బుమ్రాతో కూడా కష్టమే అని చెప్పుకొచ్చాడు. నెట్ సెషన్లలో షమీ బౌలింగ్లో గాయపడ్డా అని కూడా హిట్మ్యాన్ చెప్పాడు.
బుమ్రా కూడా ఉత్సాహంగా బౌలింగ్ చేస్తాడు:
'సాధారణంగా నెట్ సెషన్ సమయంలో ఎక్కువగా గ్రీన్ పిచ్, తేమతో కూడిన వికెట్పై బ్యాటింగ్ చేస్తాం. గత ఏడేళ్లుగా షమీతో కలిసి ఆడుతున్నా. గ్రీన్ పిచ్పై బౌలింగ్ చేసేందుకు షమీ సిద్ధంగా ఉంటాడు. బుమ్రా కూడా గ్రీన్ పిచ్పై చాలా ఉత్సాహంగా బౌలింగ్ చేస్తాడు. బ్యాట్స్మెన్ను బీట్ చేయించడంతో పాటు హెల్మెట్పైకి బంతులను విసిరేందుకు షమీ, బుమ్రా పోటీపడుతారు. పాయింట్ మీదుగా సిక్సర్ కొట్టం చాలా ఇష్టం. దీని కోసం చాలా కష్టపడ్డా. ఐపీఎల్ 2013-14 సీజన్లో లసిత్ మలింగను యార్కర్లు వేయమని చెప్పి ప్రాక్టీస్ చేశా. అప్పటి నుండి యార్కర్లను బాగా ఆడుతున్నా' అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
పది రోజులు కోలుకోలేదు:
మరోవైపు మంధాన కూడా షమీతో జరిగిన ఘటనను గుర్తుచేసుకుంది. 'అప్పట్లో షమీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండగా.. నేను అతన్ని కలిశా. ఆ సమయంలో షమీ భయ్యా నెమ్మదిగానే బౌలింగ్ చేస్తానని నాతో చెప్పాడు. మొదటి రెండు బంతులు బాగానే వేశాడు. మూడో బంతి మాత్రం అనూహ్యంగా దూసుకొచ్చి నా థై ప్యాడ్ వద్ద బలంగా తాకింది. దెబ్బకు పది రోజుల పాటు తొడ వద్ద వాపు వచ్చింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడంతో నొప్పి తగ్గింది' అని స్మృతి మంధాన పేర్కొంది.
కివీస్ పర్యటనలో గాయం:
గత ఫిబ్రవరిలో కివీస్ పర్యటనలో కాలి పిక్క గాయం (ఐదవ టీ20) కారణంగా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న హిట్మ్యాన్.. ఈ ఏడాది ఐపీఎల్కు సిద్ధమయ్యాడు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టోర్నీ నిరవధికంగా వాయిదా పడటంతో మిగతా క్రికెటర్లతో పాటు రోహిత్ కూడా ఇంటికే పరిమితమయ్యాడు.