పదకొండేళ్ల క్రితం ప్రపంచ కప్ అందుకున్న భారత్:
ఫైనల్ పోరులో దాయాది పాకిస్థాన్ను ఓడించి పొట్టి ప్రపంచకప్ను గెలుచుకుని నేటికి అంటే 24 సెప్టెంబరు 2018 నాటికి సరిగ్గా 11 ఏళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా పలువురు క్రికెట్ అభిమానులు ఆనాటి విజయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. 2007 టీ20 ప్రపంచకప్లో భారత్ ఫేవరేట్ ఏమీ కాదు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేనప్పటికీ ధోనీ టీమిండియాను ముందుండి నడిపించాడు.
అనుభవం లేకున్నా.. అద్భుతంగా:
టీ20ల్లో ఆడిన అనుభవం కూడా భారత్కు పెద్దగా లేదు. అంతకుముందు ఏడాది క్రితం దక్షిణాఫ్రికాతో భారత్ ఒక మ్యాచ్ ఆడింది. అయితే అద్భుత ప్రదర్శనతో ధోనీ సేన ఈ టోర్నీలో సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. గౌతమ్ గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
|
6 బంతులు 13 పరుగులు 1 వికెట్:
లక్ష్య ఛేదనకు దిగిన పాక్ జట్టుకు చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. అయితే చేతిలో ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. జోగిందర్ సింగ్ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని మిస్బా ఉల్ హక్ సిక్స్గా మలచడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఆ తర్వాతి బంతిని మిస్బా షార్ట్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు.
తొలి టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా:
ఊహించని రీతిలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ బంతిని ఒడిసిపట్టుకోవడంతో మ్యాచ్ విజేతగా నిలిచింది. ఇలా ఫైనల్లో గెలవడంతో టీమిండియాలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. తొలి టీ20 ప్రపంచకప్ టీమిండియా సొంతమైంది. ఈ ఘనత సాధించిన ధోనీ సేనకు బీసీసీఐ 2 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది.