హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు సెంచూరియన్ వేదికగా శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో టెస్టు టెస్టు తుది జట్టు ఎంపికలో ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్ కుమార్లను కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 'శిఖర్ ధావన్ని జట్టులో బలి పశువును చేస్తున్నారంటూ?' అని టీమిండియా మేనేజ్మెంట్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ కోహ్లీపైనే ఘాటుగా స్పందించాడు.
కేప్టౌన్ టెస్టులో భారత్ తరఫున ఎక్కువ వికెట్లు(6) తీసి.. ఎక్కువ బంతులు (127) ఆడిన భువనేశ్వర్ని రెండో టెస్టు నుంచి తప్పించడం అనాలోచిత నిర్ణయమంటూ సెహ్వాగ్ మండిపడ్డాడు. 'కేప్టౌన్ టెస్టులో ఫెయిల్ అయ్యాడని శిఖర్ ధావన్ని తప్పించారు. మరి.. భువనేశ్వర్ ఏం తప్పు చేశాడని పక్కన పెట్టారు..?' అని ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ మండిపడ్డాడు.
'అతను తొలి టెస్టులో అద్భుతంగా రాణించాడు. అయినా.. తప్పించారంటే అది కచ్చితంగా అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమే. పేస్కి అనుకూలించే సెంచూరియన్లో ఇషాంత్ శర్మ జట్టులో తప్పక ఉండాలి అనుకుంటే.. షమీ లేదా బుమ్రాని తప్పించి ఉండాల్సింది. అలా కాకుండా.. ఫామ్లో ఉన్న బౌలర్ని తప్పించడం కోహ్లి అనాలోచిత నిర్ణయమే' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
'కేప్ టౌన్ టెస్టులో భువీ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడిని రెండో టెస్టు నుంచి తప్పించడం అనాలోచిత నిర్ణయం. ఒకవేళ రెండో టెస్టులో విరాట్ కోహ్లీ.. నువ్వు ఫెయిల్ అయితే.. మూడో టెస్టు నుంచి తప్పుకుంటావా..?' అని సెహ్వాగ్ ఘాటుగా ప్రశ్నించాడు.
సెంచూరియన్ టెస్టులో గనుక టీమిండియా ఓటమి పాలైతే వరుసగా పది టెస్టు సిరిస్లను గెలిచి ప్రపంచ రికార్డుని నెలకొల్పే అవకాశం కోల్పోతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.