కోహ్లీకి అగ్ని పరీక్ష..
ఇంగ్లండ్ పర్యటన అనంతరం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే వన్డే జట్టును భారత సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ఈ మూడు వన్డేల సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్లకు విశ్రాంతినిచ్చింది. శిఖర్ ధావన్ కెప్టెన్గా రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్గా జట్టును ఎంపిక చేసింది. అయితే ఈ పర్యటనలో మూడు వన్డేల సిరీస్ అనంతరం టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం జట్టును ఈ నెలాఖరులో ప్రకటించనుంది.
పేలవ ఫామ్ నేపథ్యంలో..
అయితే ఈ టీ20 సిరీస్కు రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్లను ఎంపిక చేయనుంది. బుమ్రాకు పూర్తిగా ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వనుండగా.. విరాట్ కోహ్లీ ఎంపిక మాత్రం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లో రాణించడంపై ఆధారపడి ఉంది. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి టీ20 ఫార్మాట్ మిడిలార్డర్లో సెట్ అవుతాడనే విషయంపై సెలెక్షన్ కమిటీ క్లారిటీగా లేదని సదరు బీసీసీఐ అధికారి తెలిపాడు.
రాణిస్తే జట్టులోకి..
'టీ20 సిరీస్ కోసమే సీనియర్ ఆటగాళ్లందరికీ వెస్టిండీస్ పర్యటనలోని వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రోహిత్, పంత్, హార్దిక్ టీ20 సిరీస్తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. బుమ్రాకు మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు. కోహ్లీని మాత్రం ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లో కనబర్చే ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు.'అని సదరు అధికారి స్పష్టం చేశాడు. గత మూడేళ్లుగా విరాట్.. మూడు ఫార్మాట్లలో విఫలమవుతున్నాడు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాతనైనా అతను రాణిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
యువ ఆటగాళ్లతో తీవ్ర పోటీ..
ఐపీఎల్లోనూ తడబడ్డాడు. ఈ క్రమంలోనే మిడిలార్డర్లో సత్తా కలిగిన యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్, జడేజా, దీపక్ హుడా, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్లు ఉండగా కోహ్లీని ఆడించడం అవసరమా? అనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారు. ప్రతీ మీటింగ్లో ఆటగాళ్ల వర్క్లోడ్పై చర్చిస్తున్న టీమ్మేనేజ్మెంట్ ప్రతీ సిరీస్ తర్వాత సెకండ్ సిరీస్ విశ్రాంతినిచ్చి..ఆటగాళ్లను రొటేషన్ చేయాలని నిర్ణయించిందని ఓ అధికారి తెలిపాడు. మొత్తానికి ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో రాణించడంపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.